Dharmavaram Railway Station :ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్ ఆధునీకరించే పనులు వేగంగా సాగుతున్నాయి. బెంగళూరు, తిరుపతి, గుంతకల్‌ వంటి ప్రధాన నగరాలను కలిపే ఈ స్టేషన్‌లో సౌకర్యాలు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. అమృత్‌ భారత్‌  స్టేషన్‌లో భాగంగా  ఇక్కడ ఏడున్నర కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టారు.

ధర్మవరం రైల్వే స్టేషన్ పనుల కోసం ఇప్పటికే తొలి విడతగా మూడున్నర కోట్ల రూపాయలను రైల్వే శాఖ రిలీజ్ చేసింది. స్టేషన్ భవనాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ఆర్చ్ నియమించారు. స్టేషన్ వరకు వెళ్లే మార్గాన్ని మరింత మెరుగ్గా మార్చారు. తారు రోడ్డు వేశారు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో పార్క్ నిర్మించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. 

రైల్వే శాఖ ఆసుపత్రి, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీస్ స్టేషన్లను కూడా కొత్త బిల్డింగ్స్ కట్టించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ స్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌ వద్ద ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. ఏ ప్లాట్‌ఫామ్‌కైనా వెళ్లేందుకు వెళ్లేందుకు వీలుగా మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌లో వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లు మారేందుకు వీలుగా లిఫ్ట్‌లు, ఆరు ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్ సమస్య లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ధర్మవరం మీదుగా వెళ్లే ట్రైన్స్‌ను దారి మళ్లిస్తున్నారు. గుంతకల్లు- హిందూపురం, హిందూపురం - గుంతకల్లు, యశ్వంతపూర్‌- బీదర్, బీదర్‌- యశ్వతపూర్‌ వంటి ప్యాసింజర్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కొన్ని రైళ్లను గుత్తి, కడప, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు.