Devotees at Titumala Temple with sandals | తిరుమల: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కొందరు వ్యక్తులు చెప్పులు ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రయత్నం చేసిన ఘటనను టీటీడీ సీరియస్గా తీసుకుంది. డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చర్యలు చేపట్టింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై టీటీడీ చర్యలు
టీటీడీ ఈవో జె.శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదన పంపారు. తిరుమల మాడ వీధుల్లోనే శ్రీవారి భక్తులు పాదరక్షలు ధరించరు. అలాంటిది ఇద్దరు భక్తులు చెప్పులు ధరించి ఆలయం మహాద్వారం వరకు చేరుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీటీడీ భద్రతా విభాగం వైఫల్యానికి నిదర్శనమని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన పొరపాటు, భక్తుల ఆగ్రహాన్ని గుర్తించిన టీటీడీ శ్రీవారి ఆలయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వేటు వేసింది.
సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది: ఇద్దరుచక్రపాణి (సీనియర్ అసిస్టెంట్), వాసు (జూనియర్ అసిస్టెంట్)సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది – 5 మంది:డి. బాలకృష్ణ, PSG: 0807వసుమతి, CWPSG: 514067టి. రాజేష్ కుమార్, AWPO: 512475కె. వెంకటేష్, PSG: 932ఎం. బాబు, AWPO
సస్పెన్షన్కు ప్రతిపాదించబడిన ఎస్పీఎఫ్ సిబ్బంది – 6 మంది:సి. రమణయ్య, ASI: 1101 (ఇన్ఛార్జ్)బి. నీలబాబు, CT: 3595డి.ఎస్.కె. ప్రసన్న, CT: 3602చ. సత్యనారాయణ, ASI: 696పోలి నాయుడు, CT: 3516ఎస్. శ్రీకాంత్.
అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్లు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. శ్రీవాణి టికెట్పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 మీదుగా వీరు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే మహద్వారం వద్ద అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది వీరు డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చారని గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న మరో భక్తుడు సాక్సులు వేసుకుని వచ్చాడు. పాదరక్షలు ధరించిన భక్తలును అవి అక్కడే విడవమన్నారు. వారికి రూల్స్ వివరించి, చేసిన తప్పిదాని సిబ్బంది వివరించింది. తమకు ఈ విషయం తెలియదని, అందువల్లే ఈ తప్పిదం జరిగిందని మహారాష్ట్ర భక్తులు చెప్పారు.
సాధారణంగా శ్రీవారి మాడవీధుల్లోనూ భక్తులు పాదరక్షలు ధరించరు. కానీ దర్శనానికి వచ్చింది ఉత్తరాది భక్తులు కావడంతో ఈ విషయం తెలియక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి పాదరక్షలతోనే ప్రవేశించారు. అయితే భద్రతా సిబ్బంది సరిగా తనిఖీలు చేయకపోవడంతో పాదరక్షలతోనే మహద్వారం వరకు వారు వచ్చారని గుర్తించారు. తిరుమల ఆలయంలో ఇలాంటి ఘటన జరగడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేసింది.