తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రతి బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం సేవను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవ విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ శాస్త్రం సలహా మండలి సూచనల మేరకు ఏడాదికి ఓసారి నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మంగళవారం 09-08-2022 రోజున 77,277 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 31,272 మంది తలనీలాలు సమర్పించగా, 4.36 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులు వైకుంఠంలో 18 కంపార్ట్మెంట్లలో వేచి‌ ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. 
శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 
నేటితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే సహస్ర కలశాభిషేకంను విగ్రహ అరుగుల పరిరక్షణకై టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి‌ ఓ మారు సర్కారు వారి సహస్ర కలశాభిషేకం టీటీడీ నిర్వహిస్తొంది. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. ఇక నేటితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. 
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. మూడోవ రోజు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించిన తరువాత ఈ పవిత్రోత్సవాల్లో‌ భాగంగా చివరి రోజైన మూడోవ రోజు పూర్ణాహుతి కార్యక్రమంను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. 
సర్వదర్శనం భక్తులను నిలిపివేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. రాత్రి కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు. చివరి రోజు పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
Also Read: Horoscope 10 August 2022 Rashifal : ఈ రాశులవారు జీవిత భాగస్వామి సహాయంతో స్తిరాస్థిని కొనుగోలు చేస్తారు, ఆగస్టు 10 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి