సప్తగిరీశుడు కొలువై ఉన్న తిరుమల సందర్శనార్థం నిత్యం వేల‌ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. క్షణకాలం పాటు జరిగే శ్రీ వేంకటేశ్వరుడుని దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా చూడాలని భక్తులు పరితపించి పోతుంటారు. దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయ ప్రాయాసలకు గురై భక్తులు ముందుగా తిరుపతికి చేరుకుంటారు. ఇలా తిరుపతికి చేరుకున్న వేల మంది భక్తుల రాకతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితుంది. ఈ క్రమంలోనే శ్రీవారి పాదాల చెంత సుమారు 684 కోట్ల రూపాయలతో నిర్మితమవుతుంది శ్రీనివాస సేతు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీడీపీ ప్రభుత్వ హయాంలో గరుడ వారధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గరుడ వారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చింది. మరో వారం రోజుల్లో మొదటి దశలో శ్రీనివాస సేతు పనులు పూర్తి అయ్యి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల‌ మీదుగా ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు అధికారులు.


తిరుపతి‌ మహానగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం చూపేందుకు శ్రీనివాస సేతు (గరుడ వారధి) నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం 684 కోట్ల రూపాయలతో ఈ ఎలివేటేడ్ కారిడర్ నిర్మాణం జరుగుతుంది. చకచక జరుగుతున్న ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు కోవిడ్ కారణంగా కొద్ది నెలల పాటు వాయిదా పడ్డాయి. దీంతో మరో కొద్ది రోజుల పాటు గడువు పొడించవలసి వచ్చింది. ప్రస్తుత్తం 33 శాతం స్మార్ట్ సిటీ నిధులు, 67 శాతం టీటీడీ నిధులతో ఏడు కిలోమీటర్ల మేర శ్రీనివాస సేతు నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరుగుతున్న సమయంలో కొంత వరకూ అవాంతరాలతో పాటుగా నిధులు కేటాయింపు విషయంలో వివాదాలు‌ కూడా జరిగాయి.


మొదట్లో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను కపిలతీర్ధం వరకూ తీసుకుని రావాలని భావించినా, ఆ తరువాత భక్తుల సౌకర్యార్ధం అలిపిరి వరకూ పొడిగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. కడప వైపుగా వచ్చే యాత్రికుల వాహనాలు, బైపాస్ నుండి బస్టాండ్ మీదుగా కపిలతీర్ధం వరకూ చేరుకునేందుకు పనులు 95 శాతం వరకూ పనులు పూర్తి అయ్యాయి. వారధి పనులు పూర్తి అయితే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ భక్తుల ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తగ్గినట్లే. అయితే శ్రీనివాస సేతు నగరంకు వచ్చే యాత్రికులను, నగర వాసులను ఎంత గానీ ఆకట్టుకుంటోంది.


ప్రస్తుతం శ్రీనివాస సేతు మొదటి దశ పనులు దాదాపుగా పూర్తి కావడంతో ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధులతో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే మరో వారం పది రోజుల్లో శ్రీనివాస సేతును ప్రారంభించనున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దాదాపుగా మొదటి దశ పనులు పూర్తి కావడంతో ఆఫ్ కాన్ సంస్ధ ప్రతినిధులు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. మరో పది రోజుల్లో శ్రీనివాస సేతు(గరుడ వారధి) శ్రీవారి భక్తులకు అందుబాటులో‌ రానుంది. దీనిపై యాత్రికులు, తిరుపతి నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.