Bhumana Karunakar Reddy appointed as TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమనను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. ఈ నెల 8 తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకర్‌ రెడ్డి గతంలోనూ టీటీడీ ఛైర్మన్ గా చేసిన అనుభవం ఆయన సొంతం.


సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి..  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. టీటీడీ చైర్మన్ గా చేసి రిటైర్ అవుతానని అవకాశం కల్పించాలని సీఎం జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. గతంలో భూమన ఓ సారి 2006 నుంచి 2008 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్ గా భూమన సేవలు అందించారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పల్నాడు జిల్లాకు చెందిన  బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ రేసులో నిలిచారు. ఈ ముగ్గురిలో సీఎం జగన్ చివరికి తిరుపతి ఎమ్మెల్యే భూమనను ఎంపిక చేసి సస్పెన్స్ కు తెరదించారు.  ప్రస్తుత బోర్డు పదవి కాలం త్వరలో ముగుస్తుంది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి జాతీయ రాజకీయాల్లో బిజీగా మారనున్నారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.


టీటీడీ చైర్మన్ పోస్ట్ అంటే రాష్ట్ర మంత్రి పదవి కంటే ఎక్కువగా భావిస్తారు. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో లోక్ సభ టిక్కెట్ నిరాకరించడంతో వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించడానికి ఆధికారంలోకి రాగానే సీఎం జగన్ ఆయనకు టీటీడీ చైర్మన్ పోస్టును ఇచ్చారు. తర్వాత సైతం పదవిని కొనసాగించారు. రెండు సార్లు అంటే టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. కొత్త టీటీడీ బోర్డును  నియమించాల్సి ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఈసారి బీసీ వర్గాలకు ఇస్తారని ప్రచారం కానీ..  
అన్ని కీలక పదవులు ఒకే సామాజికవర్గానికి ఇస్తున్నారని కొంత కాలంగా టీడీపీతో పాటు జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని తిప్పికొట్టడానికి  ఈ సారి టీటీడీ చైర్మన్ పోస్టును  బీసీ వర్గాలకు ఇస్తారన్న ప్రచారం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన  బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. జంగా వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. 


రేసులోకి చెవిరెడ్డి, భూమన!
బీసీ సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రేసులోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా చెవిరెడ్డి ఉన్నారు. తుడా ఛైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగతున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి, భూమన ఇద్దరూ బరిలోకి దిగడం లేదు. వీరి వారసులు పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో టీటీడీ అత్యున్నత పదవి చెవిరెడ్డికా, భూమనకా అని చర్చ జరుగుతున్న క్రమంలో తనకు అత్యంత ఆప్తుడు అయిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఆ పదవికి సీఎం జగన్ ఎంపిక చేశారు.