Tirumala Srivaru: ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి విలువైన కానుకను సమర్పించారు. కోటి 25 లక్షల రూపాయల విలువ చేసే బంగారు అభిషేక శంఖాన్ని అందజేశారు. ఆదివారం రోజున (జులై 16వ తేదీన) తిరుమలకు వెళ్లిన సుధామూర్తి దంపతులు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ఓవీ ధర్మారెడ్డికి 2 కిలోల బరువు ఉన్న కోటి 25 లక్షల విలువ చేసే బంగారు శంఖాన్ని స్వామి వారికి కానుకగా ఇస్తున్నట్లు చెప్పి అందేశారు. అనంతరం ఆలయ ఈఓ.. సుధామూర్తి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.  నారాయణ మూర్తి మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. స్వామి వారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. 


గత నెలలో రూ.7.6 లక్షల విరాళం అందజేసిన రష్యా భక్తుడు


కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మందే భక్తులు ఉన్నారు. అయితే స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ రష్యన్ భక్తుడు జూన్ నెలలో తిరుమలకు వచ్చాడు. రూ.7.6 లక్షల విరాళాన్ని అందజేసి తన భక్తిని చాటుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు అచ్యుత మాధవ దాస్ అనే రష్యన్ భక్తుడు ఈ డబ్బును అందజేశాడు. అయితే టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి చెక్కును ఇచ్చారు. ఈ విరాళంలో ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.1.64 లక్షల రూపాయలు, ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యాదాన, వేదపారాయణ, బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని ట్రస్టులకు.. ట్రస్టుకు లక్ష చొప్పున ఖర్చు పెట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 


ఆ భక్తుడి చైన్ పై స్వామి వారి ప్రతిమ


మధ్యప్రదేశ్ రాష్ట్రం రాట్లంకి చెందిన సోనీ నానురామ్ దయరాం అనే భక్తుడితో పాటు అతని కుటుంబ సభ్యులు తిరుమలకు వచ్చారు. అయితే వారికి శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తిని.. వెరైటీగా చెప్పారు. ఆ భక్తులు వేసుకున్న చైన్ అందరూ ఆసక్తిగా తిలకించారు. 


చైన్ ద్వారా భక్తి తెలియడం ఏంటి?


సోనీ నానురామ్ దయరాం వేసుకున్న బంగారు చైన్ పై తిరుమల శ్రీనివాసుడి ప్రతిమలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మెడల్లో కూడా ప్రత్యేకమైన చైన్లు ఉన్నాయి. వెంకటేశ్వరుడి ప్రతిమతో పాటు, పద్మావతి అమ్మ వారు, అలివేమ మంగతాయారు అమ్మవారి లాకెట్లతో పాటు కళశం లాకెట్లను ధరించారు. వీరు బయటకు వచ్చిన సమయంలో భక్తులందరినీ వీరు చైన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వామి వారి దర్శన అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చాలా మంది భక్తులు వీరి మెడలో ఉన్న చైన్లను చూస్తూ.. ఇంత పెద్ద లాకెట్లు ఉంటాయా అంటూ తెగ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.