అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రి కొన్ని ఆర్జిత‌ సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీ డిప్ న‌మోదు ప్ర‌క్రియ ఈ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మొద‌లు కానుంది. అక్టోబ‌రు నెల‌కు సంబంధించి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్‌ సేవ‌, స‌హ‌స్ర‌ దీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన ద‌ర్శ‌న టికెట్ల కోటా సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్ ‌లైన్ ‌లో విడుద‌ల చేయనున్నారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచిస్తోంది.


శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం రోజున 68 వేల 467 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 35 వేల 506 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి 4.67 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వ దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయాయి. దీంతో సామాన్య భక్తులు బయట క్యూలైన్స్ లో టిబిసి వరకూ వేచి ఉన్నారు. ఇక స్వామి వారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  దాదాపు రెండు గంటల సమయం పడుతోంది.


శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్..


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపారు. 


ఏడాదికొకసారి మాత్రమే సహస్రకళషాభిషేకం..


ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల పరిరక్షణకై టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి‌ ఓ మారు మాత్రమే సర్కారు వారి సహస్రకళషాభిషేకాన్ని నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్ర దీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.