Tirumala News: జనవరి వచ్చిందింటే చాలు కొత్త ఏడాదిలో మంచి జరగాలని చెప్పి భారీగా భక్తులు శ్రీనివాసుడి దర్శనానికి క్యూ కడతారు. అలాంటి ఆలోచన ఉంటే మాత్రం కచ్చితంగా ముందు ఈ డేట్స్‌ను మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోవాలి. లేదంటే జనవరిలో మీకు శ్రీవారి దర్శనం లేనట్టే.  


శ్రీవారి దర్శనం కోసం లక్షల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్లే పరిస్థితి ఉండదు. దర్శనం టికెట్లు కూడా అంత ఈజీగా లభించవు. ఫ్రీ టికెట్లు ఉన్నా అందుకు చాలా టైం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి కోసం ప్రతి నెల టిటిడి ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేస్తుంది. 


శనివారం టికెట్లు విడుదల 


2024 సంవత్సరం పూర్తవ్వడానికి కేవలం ఇంకా 70 రోజుల మాత్రమే ఉన్నాయి. 2025 జనవరిలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఆ నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం విడుదల చేయనుంది. ఈ టికెట్ల జారీ 24వ తేదీ వరకు ఉంటుందని టీటీడీ ప్రకటించింది. ఈ ఐదు రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో పెడుతుంది. ఎవరికి కావాల్సిన సేవా టికెట్లు వాళ్లు బుక్ చేసుకోవచ్చు. పనిలో పనిగా గదులను కూడా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 


శ్రీవారి మెట్ల మార్గం పునః ప్రారంభం


గత వారం రోజుల నుంచి భారీగా పడుతున్న వర్షాలు కారణంగా మూతపడిన శ్రీవారి మెట్ల మార్గాన్ని టీటీడీ ఇవాళ ఫునః ప్రారంభించింది. నడగ మార్గం నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది. జోరు వర్షాలు కారణంగా తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఈ మార్గాన్ని మూసివేసింది. ఎవరిని కూడా ఈ మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో ఈ దారిని రీఓపెన్ చేసింది. 


గురువారం టీటీడీ హుండీ ఆదాయం 3.69 కోట్లు  


ప్రస్తుతం తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో భక్తులు దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఉచిత దర్శనం ద్వారా స్వామి ఆశీర్వాదం కోసం వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. గురువారం 58,637 మంది భక్తులు ఏడు కొండల వాడిని దర్శించుకున్నారు. 21956 మంది తలనీలాలు ఇచ్చుకున్నారు. 3.69 కోట్లుగా హుండీ ఆదాయం వచ్చింది. 


Also Read: తిరుమల ఆనందనిలయంలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి - శ్రీవారితో పాటూ ఈ విగ్రహాలను గమనించారా!