తిరుపతి : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎనిమిదోవ రోజు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి తిరుమల గిరులు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ కొనసాగుతుంది. సోమవారం 03-10-2022 రోజున 82,815 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 27,147 మంది తలనీలాలు సమర్పించగా, 3.05 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 25 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
ప్రత్యూషకాల ఆరాధన
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 


తిరుమాఢ వీధిల్లో‌ విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించిన స్వామి వారికి‌ నైవేద్యం సమర్పించి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. అనంతరం స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదోవ రోజు ఉదయం చెక్క రద్దంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధిల్లో‌ విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. రధంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి వారిని చూసి భక్తులు కర్పూరనీరాజనాలు పలుకుతున్నారు. తిరుమాఢ వీధులు భక్తజన సంద్రంగా మారడంతో గోవింద నామ స్మరణలతో మారుమ్రోగాయి. అనంతరం శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. 


ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. అనంతరం ఎనిమిదోవ రోజు రాత్రి మలయప్ప స్వామి వారి అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.అనంతరం సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.