తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం రోజున 59,776 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 25,773 మంది తలనీలాలు సమర్పించగా, 3.72 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 19 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 24 గంటల సమయం‌ పడుతుంది.‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 3 గంటల సమయం పడుతుంది. 


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ అటుతరువాత  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 


సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. 


అటు తరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.