Boy Kaushik who injured in Leopard Attack : చిరుత పులి దాడిలో గాయపడి కోలుకున్న తర్వాత శ్రీనివాసుడి ఆశీస్సులు అందుకున్న కౌశిక్..
గత నెల 22వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలోని ఏడోవ మైలు వద్ద చిరుత పులి దాడిలో గాయపడిన ఐదేళ్ళ బాలుడు కౌశిక్ కోలుకున్నాడు. దాంతో బాలుడు కౌశిక్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని ఎట్టకేలకు దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు శ్రీనివాసుడి దర్శనం చేయించారు. తిరుపతిలోని చిన్నపిల్లల ఆసుపత్రి నుండి శుక్రవారం డిశ్చార్ అయ్యాడు కౌశిక్. అనంతరం బాలుడి కుటుంబసభ్యులు తిరుమలకు చేరుకున్నారు.
అనంతరం శనివారం ఉదయం తిరుమల శ్రీవారి వీఐపీ విరామ సమయంలో తండ్రి పులికొండయ్య, తల్లి శిరీష, తమ్ముడు ప్రేమ్ కుమార్ తో కలిసి కౌశిక్ స్వామి వారి ఆశీస్సులు పొందాడు. శ్రీనివాసుడి దయతో తమ బిడ్డ చిరుత దాడి నుండి బయట పడ్టారన్నారు కుటుంబసభ్యులు. చిరుతపులి దాడిలో రక్తపు గాయాలతో ఉన్న తన బిడ్డను రక్షించేందుకు టిటిడి అన్ని విధాలుగా సహకరించి తిరిగి తమ బిడ్డను ప్రాణాలతో తమకు అప్పగించినందుకు కౌశిక్ తల్లిదండ్రులు టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


గత నెలలో బాలుడిపై చిరుతదాడి..
జూన్ 22న నడకమార్గంలో ఏడోవ మైలు వద్ద స్నాక్స్ తీసుకుని తాతయ్యతో కలిసి కొండకు నడుస్తున్న చిన్నారి కౌశిక్ పై ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసి ఆ చిన్నారిని నోట కరుచుకుంది. ఆ సమయంలో బాలుడు తాతయ్య అంటూ కేకలు వేయడంతో, వెనుతిరిగి చూసే సరికే చిరుత బాలుడిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళింది. ఈ ఘటనతో ఒక్కసారిగా చిన్నారి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో కొంతదూరం వెళ్లిన తరువాత బాలుడ్ని వదిలివెళ్లింది చిరుత. ఇదిగమనించిన సిబ్బంది, కుటుంబసభ్యులు బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో బాలుడు కౌశిక్ కోలుకోవడంతో శుక్రవారం వైద్యులు చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.


అలిపిరి నడక మార్గంలో ఐదేళ్ళ బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేసిన వేళ టీటీడీ అటవీ శాఖా అధికారులు అప్రమత్తం అయ్యారు. గాలిగోపురం నుండి ఏడో మైలు వరకూ చిరుత సంచారం అధికంగా జరిగే ప్రాంతాల్లో కెమెరా ట్రాప్స్ నిఘాతో పాటు రెండు ప్రదేశాల్లో చిరుత పులిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సాయంత్రం ఆరు నుండి రాత్రి పదకొండు వరకు నడిచే భక్తులను గుంపులు గుంపులు ఏడో‌మైలు నుండి గాలిగోపురం వరకూ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నడక మార్గం గుండా తిరుమలకు నడక సాగించే భక్తులు భయపడాల్సిన అవసరం లేదని టీటీడీ డీఏఫ్ఓ శ్రీనివాస్ ఏబీపీ దేశంతో అన్నారు.


చిరుత కోసం బోన్లు వేసిన ఫారెస్ట్ అధికారులు..
ఐదేళ్ళ చిన్నారిపై చిరుత పులి దాడితో నడక మార్గంలోని భక్తుల‌ రక్షణార్ధం చిరుత పులిని బంధించేందుకు చర్యలు చేపట్టింది.. చిరుత పులి బాలుడిని ఎత్తుకెళ్ళి ఘటనపై రీ కన్ స్ట్రక్షన్ చేసి చిరుత పులి అధికంగా సంచరించే జాడలను కనుగొన్నారు. ఆ ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా కెమరా ట్రాప్స్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా రెండు పులి బోనులను ఏర్పాటు చేసింది.‌ అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేసిన ఏడు గంటల్లోనే చిరుత బోనుకు చిక్కింది. దీంతో చిరుత పులిని తిరుపతి‌ జూ పార్క్ కు తరలించి వైద్య పరిక్షలు నిర్వహించి, అక్కడి నుండి తలకోన అటవీ ప్రాంతంలొ చిరుతను అధికారులు వదిలి పెట్టారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial