Tiruchanur Temple News: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షికవసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. మే 16న ఉదయం 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.


వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.


వైభవంగా స్నపనతిరుమంజనం
వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.


గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. వసంతోత్సవం కార‌ణంగా ఆదివారం క‌ల్యాణం, ఊంజ‌ల్‌సేవ ర‌ద్దు అయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దామోదరం పాల్గొన్నారు.


వైభవంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవం సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గంగమ్మ అన్నా గారైన కలియుగ వేంకటేశ్వరుడి వేష ధారణ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. కలియుగ వేంకటేశ్వరుడి చెల్లెలుగా విరాజిల్లుతున్న తాతయ్య గుంట గంగమ్మ జాతర వేడుకల్లో తిరుపతి ప్రజలు ఒక్కొకరు ఒకొక్క వేషధారణ ధరించి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. అందులో భాగంగా తిరుపతి ఎంపీ మద్దెల గురు మూర్తి గోవిందుడి వేషధారణ ధరించి నగర పాలక సంస్థ నుండి కాలినడకన అమ్మవారి అలయంకు చేరుకొని గంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు.. కలియుగ వేంకటేశ్వరుడి ఇలా మా మధ్యలోకి వచ్చినట్టు ఉందని తిరుపతి ప్రజలు భావించి వెంకటేశ్వర వేషధారణలో ఉన్న ఎంపీ తో సెల్ఫీ తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు.