అన్నమయ్య జిల్లాలో నేడు (మే 26) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఓ కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారు పక్కనే ఉన్న మొరవపల్లె చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులు గంగిరెడ్డి, మధులత, కుషితా రెడ్డి, దేవాన్ష్‌ రెడ్డి అని గుర్తించారు.  మృతులు నిమ్మనపల్లె మండలం రెడ్డివారి పల్లెవాసులుగా గుర్తించారు. పలమనేరులో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా పుంగనూరు రోడ్డులోని 150వ మైలు రాయి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.