Tirumala News: వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి రోజుకు వేలల్లో భక్తులు తిరుమల వస్తుంటారు. అక్కడ దైవ దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. అలాంటి వారికి తిరుమల దేవస్థానం ఆహారవసతి సదుపాయాలు కల్పిస్తున్నా అందిని వాళ్లు చాలామందే ఉంటారుయ. అలాంటి వారంతా ప్రైవేటు వ్యక్తులు కల్పించే సౌకర్యాలపై ఆధారపడి ఉంటారు. ఇప్పుడు వాళ్లే మోసాలకు పాల్పడుతున్నట్టు వెలుగుచూసింది. 


పవిత్రమైన తిరుమలలో కల్తీ వస్తువులు, కల్తీ ఆహారం అమ్మకాలు సాగుతున్న తీరు భక్తులను ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉదయం తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడులు విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయి.


తిరుమలలో చాలా హోటల్స్‌లో కల్తీ సరకులతో తయారు చేసిన ఆహారపదార్థాలు దర్శనమివ్వడంతో అధికారులు షాక్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో వండిన అన్నం, కల్తీ నూనెతో తయారు చేసిన వంటకాలు చూసిన అధికారులు నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. వారిపై కేసులు పెట్టారు. ఇకపై ఇలాంటి నాసిరకమైన ఫుడ్ పెట్టినా, కల్తీ ఆహార పదార్థాలు వాడినా మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. 




టీటీడీ అన్నదాన ప్రసాదం అందిస్తున్నప్పటికీ అక్కడ భారీగా క్యూలైన్లు ఉండటం బస చేసే ప్రాంతానికి దూరంగా ఉందన్న కారణంతో చాలా మంది ఈ ప్రైవేటు హోటల్స్‌పై ఆధార పడుతున్నారు. అలాంటి వారే ఈ హోటల్స్ వారికి టార్గెట్ అవుతున్నారు. టీటీడీ అన్నప్రసాదం అక్కడక్కడా పెడుతున్నా సమయానికి అక్కడకు చేరుకోలేని వారికి ఈ హోటల్సే గతి. అందుకే వారు పెట్టిందే ఆహారం అవుతుంది.