అమరావతి: రాజకీయ లబ్ధి కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడే వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు తిరుపతిలో విద్యార్థుల గొడవను ప్రస్తావించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ‘తిరుపతిలో విద్యార్థుల మధ్య జరిగిన ఓ వ్యక్తిగత గొడవను మా పార్టీపై రుద్ది పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నారు. దళిత సోదరులను రెచ్చగొట్టేలా సాక్షిలో తప్పుడు రాతలతో విషం చిమ్ముతున్నారు. మే 15వ తేదీ రాత్రి తిరుపతిలో జేమ్స్ అనే దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం A1 యశ్వంత్, A-2 కిరణ్, A-3 జగ్గ, A-4 లలిత్, A-5 సాయి గౌడ్, A-6 వంశీ, A7 రూపేష్, మరికొందర్ని నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేశారు.
దళిత విద్యార్థి జేమ్స్ మీద దాడి చేసిన నిందితుల్లో జగదీష్ @ జగ్గ, లలిత్ @ లలిత్ గోపాల్, నాని, సాయి గౌడ్ లు మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు. ఉండు రూపేష్ రెడ్డి @ రూపి, సాయి కిరణ్ కుమార్ రెడ్డి లు భూమన అభినయ్ రెడ్డి వద్ద పనిచేసే వారు. వంశీ @ చోట బ్లేడ్ ఎంపీ గురుమూర్తి అనుచరుడు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ వారు జేమ్స్ ను కిడ్నాప్ చేసి, దాడి చేశారంటూ మాజీ సీఎం జగన్ సాక్షిలో తప్పుడు కథనాలు రాయించారు. తిరుపతి ఘటనలో పోలీసులు ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు.
రాజకీయంగా జగన్ రెడ్డి హిస్టరీ యావత్తు ఆసాంతం రక్తచరిత్రే. బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని బాత్రూమ్ లో గొడ్డలివేటుతో చంపేసి.. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి నాడు సాక్షిలో అడ్డగోలు రాతలు రాయించారు. అసలు నిజమేంటో సొంత చెల్లెళ్లు వైఎస్ సునీత, వైఎస్ షర్మిత సహా రాష్ట్ర ప్రజలంతా ఆలస్యంగా తెలుసుకున్నారు. అధికారంలో ఉండగా డాక్టర్ సుధాకర్ మొదలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళిత సోదరులను ఊచకోత కోసిన జగన్... ప్రతిపక్షంలోనూ అదే తీరు కొనసాగిస్తున్నాడు. తిరుపతి ఘటనలో వాస్తవాలను, జగన్ రెడ్డి కుట్రలను గుర్తించి యావత్ దళిత సమాజం అప్రమత్తంగా ఉండాలని’ ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.