Heavy rush continues in Tirumala | తిరుపతి: కలియుగదైవం శ్రీనివాసుడి క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మే 25న (శనివారం) ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేస‌వి సెలవులతో పాటు వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. గ‌త 10 రోజుల్లో శ్రీ‌వారి మెట్టు, అలిపిరి న‌డ‌క మార్గాల్లో దాదాపు 2.60 ల‌క్ష‌ల మంది భ‌క్తులు తిరుమ‌లకు చేరుకొని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ద‌ర్శించుకున్నారని టీటీడీ తెలిపింది.


భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు 
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్వామివారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమలకు వస్తున్న భక్తులకు అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా శిలాతోర‌ణం, బాట గంగ‌మ్మ గుడి, మార్గ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం క్యూలైన్లలో ఉన్న భ‌క్తుల సౌక‌ర్యార్థం 27 ప్రాంతాల్లో తాగునీరు, 4 ప్రాంత‌ల్లో అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నారు. తిరుమలకు విచ్చేసిన భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం అక్టోప‌స్ భ‌వ‌నం నుంచి శిలాతోర‌ణం వ‌ర‌కు 8 బ‌స్సులు ఏర్పాటు చేసి ప్ర‌తి నిమిషానికి భ‌క్తుల‌ను చేర‌వేసేలా టీటీడీ అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు.


మధ్యాహ్నానికి అన్న ప్రసాదాలు వితరణ ఇలా.. 
శనివారం మధ్యాహ్నానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే దాదాపు 60 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో  50 వేల మందికి అన్నప్రసాదాలుగా ఉప్మా, పొంగల్ పంపిణీ చేశారు. తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సాధారణం కంటే ఎక్కువగా అన్న ప్రసాదాలు వారికి అందించారు. క్యూలైన్లో ఉన్న పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. తిరుమల క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించి చర్యలు తీసుకున్నారు. 


భక్తుల రద్దీతో టీటీడీ నిర్ణయం 
భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వ‌ర‌కు శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారాల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్ధు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. మే 25 (శనివారం) సాయంత్రం 5 గంటల వరకు 46,486 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.