Chittoor News: రాయలసీమ ఇక్కడ రాజులు పరిపాలన సాగేది.. రతనాల సీమ అంటారు కాని గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక రైతులు రాళ్ల సీమగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమపై వరుణ దేవుడు కరుణించాడు.. ఎట్టకేలకు తుపాను రూపంలో మేఘం కరిగి చినుకుగా మారి భూవికి చేరింది. 


తుపాను కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి కుంటలు నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మేరకు అతి భారీ వర్షాలు కురిస్తే రాయలసీమలో జలకళను సంతరించుకున్నట్టే.


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఇలాగే కొనసాగాలని రైతులు కోరుకుంటున్నారు. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే సంప్రదించాలని టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు అయా మండల స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇంత చేస్తున్న అధికారులు నీటి నిల్వకు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి మాత్రం కనిపించలేదు.


నీటి వృథా అరికట్టేనా..? 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ రకాల ప్రాజెక్టులు, చెరువులు, డ్యామ్ లు ఉన్నాయి. ఇక పెద్ద చెరువులు సైతం ఉన్నాయి. వీటిలో ఒక్కసారి భారీ వర్షాలు కురిస్తే రెండు సంవత్సరాల వరకు రైతులకు, పట్టణాలకు సాగు నీటి, తాగు నీటి సమస్య లేకుండా పోతుంది.


విజయవాడ వరదలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే జలవనరుల శాఖ, నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖతో సమావేశం నిర్వహించారు. ఆయా పంచాయతీల పరిధిలో ప్రాజెక్టులు, చెరువులు, డ్యామ్ లను పరిశీలించి నీరు వస్తే విడుదల చేసే వరకు నీటిని నిల్వ చేసే ఆస్కారంపై చర్చించారు. ఎక్కడ అవసరం అయితే అక్కడ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అదేశించారు. దీనికి అధికారులు సైతం సుముఖత వ్యక్తం చేశారు.


మీటింగ్ జరిగి మూడు నెలల గడిచిన తరువాత వర్షాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు అధికారులు నీటి వృథా కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోకపోవడంతో నీటి వృథా అరికట్టే చర్యలు తీసుకోలేదు. దీనికి నిధుల విడుదల కూడా ప్రధాన కారణంగా చూడొచ్చు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు డ్యాములు, ప్రాజెక్టు లు, చెరువులు నిండి ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాలని మాత్రమే ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నారు. 


తిరుమలకు నీటి సమస్య తీరేనా..? 
తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు తిరుమలలో కూడా  ఉంది.  తిరుమలలోని అన్ని ప్రాజెక్టుల పూర్తిగా ఎండిపోయాయి. మరో నెల రోజుల్లో వర్షాలు లేకపోతే నీటి సమస్య ప్రారంభమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ తరుణంలో కురుస్తున్న వర్షాలకు కొండల్లో నీరు ప్రాజెక్టులకు చేరి ప్రాజెక్టులు నిండితే మరే రెండు సంవత్సరాల వరకు తిరుమలకు నీటి సమస్య లేకుండా పోతుంది. ఈ తుపాను ప్రభావం ఎంత మేరా నీటిని అందిస్తుందో చూడాలి.


Also Read: ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..