Chittoor Latest News: పరాయి వ్యక్తులతో శారీరక సంబంధాలు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. ప్రేయసి కోసం కన్న వారిని సైతం కడతేర్చేందుకు కొందరు మృగాలు వెనుకాడడం‌ లేదు. అంతే కాకుండా వావివరుస లేకుండా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా శారీరక సంబంధాలు పెట్టుకుని నలుగురిలో కన్నవారికి తలవంపులు తెస్తున్నారు కొందరు యువకులు. తాజాగా తన శారీరక సంబంధానికి తండ్రి అడ్డుగా ఉన్నాడని కోపోద్రిక్తుడై కొడుకు తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిని దారుణంగా చితకబాదిన ఘటన చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగింది. కొడుకు చేతిలో తీవ్ర గాయాల‌పాలైన తండ్రి చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు నగరంలోని (Chittoor News) గాంధీ రోడ్డులో ఢిల్లీ బాబు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. హోంగార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని ఢిల్లి బాబు పోషిస్తున్నాడు. ఢిల్లి బాబుకు ఒక్కగానొక్క కుమారుడు భరత్ (21) కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. తన కుమారుడు బాగా చదివి వృద్దిలోకి వస్తాడని భావించిన ఢిల్లి బాబుకి భరత్ ఎప్పుడూ ఏదోక ఆకతాయి పనులు చేస్తూ షాక్ కి గురి చేసేవాడు. చెడు వ్యసనాలకు గురై భరత్ కళాశాలకు వెళ్ళకుండా బలాదూర్ తిరుగుతూ తండ్రిని నమ్మించేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ బాబు భరత్‌ను కళాశాలకు నిలిపి వేసి కూలీ‌ పనులకు పంపాడు. 


అయితే కూలీ పనులకు వెళ్ళే భరత్ కు బైపాస్ రోడ్డు సమీపంలో కొత్తూరుకు చేందిన ఝాన్సీ (39) అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. అయితే ఝాన్సీ భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉండడంతో వీరి పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. తనకంటే వయస్సులో పెద్దైన, ఇద్దరు పిల్లలకు తల్లైన ఝాన్సీ తరచూ ఇంటికి తీసుకుని వచ్చి కన్నవారి ముందే చనువుగా ఉంటూ శారీరక సంబంధం కొనసాగించేవాడు భరత్. తన కుమారుడు చేస్తున్న పనులను చూసిన ఢిల్లి బాబు మనోవేదనకు గురై భరత్ తో గొడవకు దిగి కొద్ది నెలల‌ క్రితం చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషను లో ఫిర్యాదు చేశాడు.


దీంతో కేసు నమోదు అయింది. ఎస్సై భరత్ ను, ఝాన్సీని పోలీసులు స్టేషను కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కానీ భరత్ లో ఝాన్సీలో ఎటువంటి మార్పు రాక పోవడంతో ఢిల్లీ బాబు తన కుమారుడిని గట్టిగా నిలదీశాడు. దీంతో తన శారీరక సంబంధానికి తన తండ్రే అడ్డుగా ఉన్నాడని భావించిన భరత్ ఆదివారం సాయంత్రం తన ప్రియురాలు ఝాన్సీకి వీడియో కాల్ చేసి తండ్రిని చితకబాదాడు. తన తండ్రిని చితకబాదుతూ ప్రియురాలితో కలిసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. అడ్డు వచ్చిన తల్లిని సైతం భరత్ చితకబాదాడు. తీవ్ర రక్తస్రావంలో‌ ఉన్న ఢిల్లీ బాబును స్ధానికుల సహాయంతో ఢిల్లీ బాబు భార్య చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.