Chandrababu Sri City Visit: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామికరంగం వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్టివ్ ఇండస్ట్రీయల్ జోన్ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం... మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు శ్రీసిటీ చిరకాల వాంఛ అయిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు. 


220 కంపెనీలకు చోటు


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చాయి. శ్రీసిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయం


శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది నా ఆలోచన. శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. శ్రీసిటీని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. పచ్చదనం కోసం వంద శాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు చేపడతాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించాలి, ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది.


నాలుగేళ్లు నెంబర్ 1
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నాలుగేళ్లు నెంబర్ వన్ గా ఉన్నాం. 2029 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుంది. ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. అదీ ఆంధ్రప్రదేశ్ సామర్థ్యం. రానున్న 25 సంవత్సరాల్లో 15 శాతం వృద్ధి రేటు మా లక్ష్యం. జీరో పావర్టీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. పీ4 మోడల్ అమలు చేస్తున్నాం. టాప్ 10 శాతంలో ఉన్నవారు కింది 20 శాతంలో ఉన్నవారికి సాయం అందించాలి. డెమోగ్రఫిక్ మేనేజ్‌మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తాం. అనుకూల వాతావరణం కల్పిస్తాం. డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తాం. శాంతి భద్రతల విషయంలో జీరో టాలరెన్స్ మా లక్ష్యం. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం అని ముఖ్యమంత్రి అన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి అనిత, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్,  ఎమ్మెల్యేలు శ్రీ. కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, డీజీపీ ద్వారకా తిరుమల రావు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ & ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ , ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, శ్రీసిటీ యాజమాన్యం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.