సీఎం జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను జైలులో పెట్టించాడని, పండగపూట వారిని కలిసి పరామర్శించేందుకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ శ్రేణులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారని, నీచాతి నీచంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. పోలీసుల తీరు ఉగ్రవాదులను తలపిస్తుందని అన్నారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నీ పని, నీ పార్టీ పని అయిపోయింది జగన్ రెడ్డీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 


రొంపిచర్ల ఫ్లెక్సీల వివాదంలో టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. సోమవారం (జనవరి 16) మధ్యాహ్నం అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ నేతలు కోడికత్తి డ్రామాలు ఆడొద్దని ఎద్దేవా చేశారు. ఏపీలో మైనార్టీలకు మనుగడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘ఫ్లెక్సీలు చించివేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? బ్యానర్లు ఎందుకు చింపుతున్నారని అడిగిన పాపానికి కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రొంపిచర్లలో అతి దారుణంగా 8 మంది మైనారిటీలపై కేసులు పెట్టారు. చెప్పిన మాట వినకపోతే తుపాకీ చూపించి చంపేస్తామని పోలీసులు బెదిరించారు. దీనికంటే టెర్రరిస్టు చర్య మరోకటి ఉంటుందా? ఇష్టానుసారంగా కొట్టి మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పాటించాలి. కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా? పోలీసులు ఖబడ్దార్.. జాగ్రత్త, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు’’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.


ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ‘‘నా కార్యకర్తలను జైళ్లలో పెట్టారు పెద్దిరెడ్డీ.. పండగ పూట నా కార్యకర్తల కోసం జైలుకు వచ్చా. ఇక నీ పని అయిపోయింది. నీ పార్టీ పని కూడా అయిపోయింది పెద్దిరెడ్డీ. సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.