చేతికంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్నాడు. బతుకుతాడని ఏ మూలో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు.. ‘మీ అబ్బాయి బ్రెయిన్‌డెడ్‌’ అంటూ వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని ఆ కుటుంబం స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారణ అయిన యువకుడు మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపాడు.


చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసే దాతల పెద్దమనసు పలువురు బాధితులకు వరంగా మారుతోంది. శరీరంలోని అవయవాల మార్పిడి ద్వారా రోగి ప్రాణాలనూ కాపాడుతోంది. సామాజిక స్పృహ కలిగిన కొద్ది మంది తమ మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆప్తులు మరణ అంచుల్లో ఉన్నప్పటికీ మరికొందరు.. పరుల మేలు ఆలోచించి.. పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. తాజాగా బ్రైయిన్ డెడ్ అయిన అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం.. మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపనుంది.


గుండె.. కాలేయం.. కళ్లు.. కిడ్నీలు.. ఇలా ముఖ్య అవయవాల కోసం నిరీక్షిస్తున్న వారెందరో ఉన్నారు. మనం చనిపోయిన కూడా మరొకరికి పునఃజన్మ ఇవ్వడానికి మేమున్నామంటూ ముందుకొచ్చి దానం చేస్తున్నారు. అలాగే తాజాగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో ఆదర్శప్రాయమైంది.


ఈమధ్యకాలంలో అవయవదానం ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతోంది. బాధితుల బంధువులు, తల్లిదండ్రుల ఔదార్యంతో అవయవాల దానం ప్రాణాలకు ఆసరాగా నిలుస్తోంది. విషాదంలోనూ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొడుకు మరో రూపంలో బ్రతికే ఉండాలని ఆకాంక్షించి అవయవదానానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...


కృష్ణాజిల్లా చిన్న ముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయ ప్రకాష్ (22) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. చికిత్స కు స్పందించకపోవడంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. వెంటనే విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి వైద్యులు బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయవదానానికి ఒప్పుకున్నారు.  విషాదంలోనూ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొడుకు మరో రూపంలో బ్రతికే ఉండాలని ఆకాంక్షించి జీవన్ దాన్ కింద అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటుచేసిన వేరు వేరు ప్రాంతాల్లోని మూడు ఆసుపత్రులకు జయప్రకాష్ గుండె, కాలేయం, మూత్రపిండాలు తరలించినట్లు ఆయుష్ ఆస్పత్రి చైర్మన్ రమేష్ బాబు తెలిపారు.  గారపాటి జయ ప్రకాష్ గుండెను గ్రీన్ ఛానల్ రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్ పోర్ట్ కు తరలించారు.


ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి తిరుపతికి.. 
అవయవ దానంలో భాగంగా జయ ప్రకాష్ గుండెను వైద్యులు సేకరించారు. వైద్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండెను తొలుత అంబులెన్స్ లో రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన తరలించారు. తరువాత గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ హాస్పిటల్ కు తరలించారు. ఒక కిడ్నీ ఆయుష్ హాస్పిటల్ కు, లివర్ ను మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. రోడ్డు మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు పక్కగా జాగ్రత్తలు చేపట్టారు. అంబులెన్స్ ఎక్కడ ఆగకుండా నేరుగా ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లే విధంగా ప్రణాళికలు వేశారు. ఎక్కడ కూడా ఆలస్యం అవ్వకుండా అనుకున్న సమయానికి అంబులెన్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ కు తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ హాస్పిటల్ కి తరలించారు.