Bcy chief Ramachandra Yadav: వైసీపీ పాలనలో కేవలం హత్య రాజకీయాలు తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుంగనూరు లోని తన నివాసంలో శనివారం విలేకరుల సవమేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేణిగుంట నుంచి పుంగనూరుకు వచ్చే మార్గంలో అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి రామచంద్రారెడ్డి కుట్రపూరితంగా అడ్డంకులు ఏర్పరుస్తున్నారని విమర్శించారు. ప్రతిలక్షాలపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని, అధికార బలంతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని వెల్లడించారు.


పుంగనూరులో గంజాయి విక్రయాలను పోలీసులు అరికట్ట లేక పోతున్నారన్నారు. వైసీపీ నాయకులు రౌడీయిజం చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పుంగనూరు నుండి మార్పు ప్రారంభమైందని స్పష్టం చేసారు. బీసీవై పార్టీ ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తామన్నారు. రాష్ట్రంలో వేల ఎకరాల భూములు దోపిడీ చేశారన్నారు. జగన్ పాలనలో ప్రభుత్వ, అటవీ భూములు, ప్రైవేటు భూములకు కూడా రక్షణ కరువైందన్నారు. గనులను కొల్లగొట్టి వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శలు చేశారు. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు సినిమా వ్యవస్థలు 20 శాతం ముడుపులు అందిస్తే తప్ప నడవని పరిస్థితి ఉందని ఎద్దెవ చేసారు.