శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి (సెప్టెంబరు 18) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, రోజా, టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌ రెడ్డి, బోర్డు సభ్యులు యానాదయ్య, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రహ్మణ్యం, భరత్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, మధుసూదన్ యాదవ్, ఈవో ఏవీ. ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే.బాలాజి, జేఈవోలు సదా భార్గవి, వీర‌బ్ర‌హ్మం, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత‌, సీవీఎస్ఓ న‌ర‌సింహ‌కిషోర్, ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


జగన్మోహన్ రెడ్డి తిరుపతి తిరుమలలో రెండు రోజుల పర్యటించనున్నారు. కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి పద్మావతి అతిధి గృహం వద్ద టీటీడీ చైర్మన్ భుమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ అధికారులు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.. అనంతరం మర్యాద పూర్వకంగా పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అర్చకులు జగన్ మోహన్ రెడ్డిని కలిసి శాలువతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం పద్మావతి గృహంలో నుంచి సాంప్రదాయ వస్త్రం ధరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బేడీ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.