CM YS Jagan: తిరుప‌తి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరునగరిలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవ‌ర్‌ను సోమవారం సీఎం వైఎస్‌ జ‌గన్ మో‌హన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.650.50 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవ‌ర్ తిరుప‌తి ఆధ్యాత్మిక న‌గ‌రానికి ఆభరణం లాంటిద‌న్నారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతమని, దీని వల్ల ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, యాత్రికులు సుల‌భంగా తిరుమ‌ల‌కు చేరుకోగ‌ల‌గుతార‌ని చెప్పారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రూ.37.80 కోట్లతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను సోమవారం సీఎం జగన్ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. హాస్టల్ బ్లాకుల్లో మొత్తం 181 గదులు ఉన్నాయి. ఇందులో 750 మంది విద్యార్థులు బస చేయ‌వ‌చ్చు.


టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల  పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ సంద‌ర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టీటీడీ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమన్నారు. మొత్తం 6,700 మంది టీటీడీ ఉద్యోగులు ఉండ‌గా ప్రస్తుతం రూ.313 కోట్ల వ్యయంతో 3,518 మందికి ఇంటి స్థల ప‌ట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మరో రూ.280 కోట్ల వ్యయంతో మిగిలిన ఉద్యోగులకు కూడా 30 నుంచి 45 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం కొంతమంది ఉద్యోగులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.


అంత‌కుముందు తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గ‌తంలో టీటీడీ ఉద్యోగుల‌కు ఇళ్లస్థలాలు మంజూర‌య్యాయ‌ని, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి హయాంలోనే ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. తండ్రీ కొడుకుల హయాంలో టీటీడీ బోర్డు చైర్మన్‌గా పని చేయడం త‌న అదృష్టమన్నారు. టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం ప్రారంభంలో ఈ మూడు కార్యక్రమాలకు సంబంధించి వీడియో విజువ‌ల్‌ను ప్రదర్శించారు.


గంగమ్మను ద‌ర్శించుకున్న ముఖ్యమంత్రి
ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు తిరుప‌తిలోని తాతయ్యగుంట గంగమ్మను ద‌ర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర సందర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారు సంప్రదాయంగా సారె పంపుతారు. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కృషితో ముఖ్యమంత్రి తిరుమల చేరుకునే ముందు గంగ‌మ్మను ద‌ర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత సంవత్సరం నుంచి పునఃప్రారంభ‌మైంది.


డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్, రోజా, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మేయర్ శిరీష, డెప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, తిరుప‌తి మున్సిప‌ల్ కమిషనర్ హరిత, టీటీడీ జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఛీప్ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, జిల్లా, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.