Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మెగా పీటీఎం 2.0లో ఆసక్తికరమైన సీన్ కనిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పీటీఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు ఇలా అందర్నీ ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఈ పీటీఎం నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలకు వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి కబుర్లు చెప్పారు. వారి ఆసక్తులు, ఆలోచనలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు విద్యార్థులకు పాఠాలు చెప్పారు. సాంఘీశాస్త్ర ఉపాధ్యాయుడిగా మారిన చంద్రబాబు "వనరులు" అనే పాఠాన్ని బోధించారు. విద్యార్థులతో కలిసి నారా లోకేష్ కూడా ముందు బెంచ్లో కూర్చొని పాఠాలు శ్రద్ధగా విన్నారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి మార్కులు, చదువుపై ఆరా తీశారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర వ్యక్తులతో మాట్లాడుతూ పాఠశాల ఎలా ఉంది. పాఠాలు ఎలా చెబుతున్నారు. సౌకర్యాలు ఉన్నాయా లేదా, తల్లికి వందనం వచ్చిందా లేదా ఇలా చాలా విషయాలు వారితో చర్చించారు. వారితో ఫొటోలు కూడా దిగారు. విద్యార్థి దశ నుంచి ఓ గోల్ పెట్టుకొని చదవాలని విద్యార్థులకు చంద్రబాబు సూచించారు. పరిస్థితులు ఒకప్పుడులా లేవని ఇప్పుడు కచ్చితంగా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని విద్యావ్యవస్థల్లో మార్పులు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
ఇదే టైంలో విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి సీట్లు కొట్టిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థుల్లో నీట్ లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సీటు పొందిన విద్యార్థులకు లక్ష రూపాయలు నగదు బహుమతి అంద జేయనుంది. ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మెటిక్ కిట్స్ ఇవ్వాలని నిర్మయించింది. సీట్లు సాధించలేక పోయిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వబోతున్నారు.