Telugu News: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌ కింద పంటలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులతో కలిసి ఆయన ఆందోళనకు దిగినందుకు పోలీసులు ఆరెస్టు చేశారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు గుంతకల్లు బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు రైతులతో పయ్యావుల కేశవ్ సమావేశం అయ్యారు. రైతులతో కలిసి రోడ్డుపై కూర్చొని ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఉరవకొండ సమీపంలోనే హంద్రీనీవా కెనాల్ వద్ద బళ్లారి - అనంతపురం హైవేపై రైతులతో కలిసి కూర్చొని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జనసేన నేతలు, వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేశారు.


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకి హంద్రీనీవా నీటిని తీసుకెళ్ళేందుకు తాపత్రయపడుతున్నాడే తప్ప ఉరవకొండ రైతులకు మాత్రం నీటిని ఇవ్వడం లేదని విమర్శించారు. వేల ఎకరాల్లో పంటలు సాగు చేసిన గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులకు హంద్రీనీవా నుంచి నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉందని, అయినా కేవలం తన స్వప్రయోజనాల కోసమే మంత్రి పెద్దిరెడ్డి హంద్రీనీవా నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రెండు రోజులలోగా సమస్యలను పరిష్కారం చేయకపోతే తామే హంద్రీనీవా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కి నీటిని విడుదల చేస్తామని విమర్శించారు.