Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. రోజుకీ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) రద్దు చేసింది టీటీడీ. 


ఆర్జిత, నిత్య సేవల్లో భక్తులకు అవకాశం 


శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభమైన ప్రత్యక్షంగా ఆర్జిత, నిత్య సేవలలో పాల్గొనే అవకాశం మాత్రం భక్తులకు దక్కలేదు. భక్తుల కోరిక మేరకు కల్యాణోత్సవ సేవను వర్చువల్ గా ప్రారంభించింది టీటీడీ. వర్చువల్ సేవకు భక్తుల వద్ద నుంచి విశేష స్పందన రావడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను వర్చువల్ గా ప్రారంభించింది టీటీడీ. శ్రీవారికి వారానికి ఒక్కసారి నిర్వహించే విశేష పూజ, అష్టదళము,సహస్ర కలిశాభిషేకం,తిరుప్పావడ, నిత్యం నిర్వహించే వసంతోత్సవ సేవను ప్రారంభించలేదు టీటీడీ. గతేడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి సేవలను ప్రారంభిస్తామని టీటీడీ ప్రకటించినా కేసులు భారీగా పెరుగుతుండటంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మరల ఈ ఏడాది ఆర్జిత, నిత్య సేవలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.


భక్తుల విజ్ఞప్తితో 


కోవిడ్ ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య పెంపుపై దృష్టి సారించిన టీటీడీ. ఈ క్రమంలో గత రెండు ఏళ్లుగా వికలాంగులు, వయోవృద్దులకు జారీ చేసే దర్శన విధానంలో నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత వికలాంగులు, వయోవృద్దులకు స్వామి వారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ముందు వరకూ తిరుమలలోని మ్యూజియం వద్ద ఉన్న కౌంటర్లో ఉదయం 10 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు 750 టోకెన్లను వయోవృద్దులకు, వికలాంగులకు కేటాయించేది టీటీడీ. అయితే కోవిడ్ కారణంగా ఈ టోకెన్ల జారీని నిలిపి వేసింది. కోవిడ్ పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్యను పెంచింది. అయితే ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వికలాంగులకు, వయోవృద్దులకు దర్శనం కల్పచాలంటూ భక్తులు టీటీడీ అధికారులను విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా అధికారులకు పెద్ద ఎత్తున లేఖలు కూడా రావడంతో దీనిపై సానుకూలంగా స్పందించింది టీటీడీ. 


ఏప్రిల్ 1 నుంచి దర్శనభాగ్యం


ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్దులు, వికలాంగులకు కల్పించే దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. రోజుకి 1000 టిక్కెట్ల చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనుంది టీటీడీ. అయితే శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పది గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్దులకు, వికలాంగులు దర్శన భాగ్యం కల్పిచేందుకు చర్యలు చేపడుతుంది. అయితే వీరికి అందజేసే టోకెన్ల జారీ ప్రక్రియను తిరుమలలో జారీ చేస్తారా..లేక తిరుపతిలో‌ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారా.. లేక ఆన్లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తారా అన్న విషయం మాత్రం తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ వికలాంగులు, వయోవృద్దుల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.