Tirumala Darshan Tickets : జనవరి 2 నుంచి 11 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులో ఉంచనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు సంబంధించి మొత్తం 2 లక్షల టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. టికెట్లు ఉన్నవారికి మాత్రమే తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.  


రోజుకు 50 వేల సర్వదర్శనం టికెట్లు 


జనవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. దర్శన టికెట్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం చేయిస్తామని పేర్కొంది. టికెట్లు లేని వారిని దర్శనానికి అనుమతి ఉండదని చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 20 వేలు, సర్వదర్శనం టికెట్లు రోజుకి 50 వేల టికెట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి 5 లక్షల సర్వ దర్శనం టికెట్లు కేటాయిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శన టికెట్ల కోసం తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు, తిరుమలలో ఒక్క కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.  


ఆధార్ కార్డు తప్పనిసరి 


ప్రతిరోజు ఉదయం రెండు గంటల నుంచి టికెట్లు కేటాయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు‌ పొందే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వ దినాల్లో అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో రోజుకి 2 వేల చొప్పున కేటాయిస్తామన్నారు. శ్రీవాణి టికెట్లు కలిగిన వారికి మహాలఘు దర్శనం కల్పిస్తామని వివరించారు. పోలీసులు, జిల్లా అధికారులు భక్తులకు అవసరమైన సౌఖర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గోవింద మాల భక్తులు కూడా టికెట్లు తీసుకునే రావాలన్నారు. వారికి ప్రత్యేక దర్శనాలు ఏమీ ఉండవని చెప్పుకొచ్చారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకి రావచ్చు కానీ దర్శనానికి అనుమతి ఉండదని వివరించారు. డిసెంబరు 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు వసతి రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 


కేటాయించిన సమయానికి దర్శనానికి రావాలి 


ట్రాఫిక్ ఇబ్బంది, శాంతిభద్రతల సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జనవరి 2వ తేదీ వేకువ జామున 1:40 నుంచి వీఐపీ దర్శనం  ఉంటుందని చెప్పింది. ఉదయం 5 గంటలకు సామాన్య భక్తులకు దర్శనం టీటీడీ వెల్లడించింది. జనవరి రెండో తేదీన వైకుంఠ ఏకాదశి నాడు, బంగారు తెరు, మూడన ద్వాదశి నాడు చక్రస్నానం ఉంటుందని తెలిపింది. టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి రావాలని టీటీడీ సూచించింది.