Year Ender 2022: 2022 సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ 23 వరకు, 36 కంపెనీల IPOలు స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అయ్యాయి. ఈ IPOల్లో చాలా వరకు వివిధ కారణాల వల్ల మీడియా దృష్టిని ఆకర్షించాయి. 


ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన టాప్-10 పబ్లిక్ ఇష్యూలు ఇవి:


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రూ. 21,008.48 కోట్ల ఇష్యూ సైజ్‌తో ఇప్పటి వరకు దేశంలోనే అతి పెద్ద IPOగా అవతరించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPO, రూ. 949 ఇష్యూ ధరతో వచ్చింది. భారీ ప్రచారంతో వచ్చి, స్టాక్‌ మార్కెట్‌లో బోల్తా పడింది.


దేశంలో అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీల్లో ఒకటైన అదానీ విల్మార్, 2022 జనవరి చివరి వారంలో తన IPOను ప్రారంభించింది. అదానీ గ్రూప్‌ రూపంలో బలమైన మద్దతుదారు ఉన్నప్పటికీ, పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అవ్వడంలో ఇది విఫలమైంది, బలహీనమైన లిస్టింగ్‌ను ఎదుర్కొంది. తిరిగి పుంజుకుని, 2022లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన IPOగా నిలిచింది.


పతంజలి ఫుడ్స్‌గా పేరు మార్చుకున్న రుచి సోయా ఇండస్ట్రీస్, బాబా రామ్‌దేవ్ మద్దతున్న పతంజలి గ్రూప్‌ నుంచి పబ్లిక్‌లోకి వచ్చిన మొదటి కంపెనీ. వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు IPOలను లిస్ట్ చేస్తామన్న పతంజలి గ్రూప్‌ ప్రకటన తర్వాత ఈ షేర్ ధరలు పెరిగాయి.


ఇష్యూ సైజ్‌ పరంగా, 2022లో LIC తర్వాత డెలివెరీ రెండో అతి పెద్ద IPO.  డెలివరీ సర్వీసెస్ ప్రొవైడర్ తన IPO ద్వారా రూ. 5,235 కోట్లను సమీకరించింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే, డిసెంబర్ 12 నాటికి 28.88 శాతం క్షీణత నమోదు చేసింది.


హర్ష ఇంజనీర్స్ IPO షేర్లు 35-36 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. సెప్టెంబరు 16న IPO బిడ్డింగ్ ముగిసింది, 74.7 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ సంవత్సరం ఇన్వెస్టర్లు ఎక్కువ మోజు పడ్డ ఇష్యూల్లో ఒకటిగా ఇది నిలిచింది.


పెట్టుబడిదార్లు ఈ సంవత్సరం అత్యధికంగా వెంటాడిన IPOల జాబితాలో ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఒకటి. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రానిక్స్ మార్ట్, ఇష్యూ ఆఫర్‌ కంటే దాదాపు 72 రెట్లు  ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌లను చూసింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల నుంచి కూడా బలమైన స్పందనను ఆకర్షించింది.


DCX సిస్టమ్స్ తన పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలను సమీకరించింది. ఈ IPO దాదాపు 70 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ చూసింది, లిస్టింగ్ రోజున షేర్‌ ధర 49 శాతం పెరిగింది. అయితే, లిస్టింగ్‌ ధరతో పోలిస్తే, డిసెంబర్ 12 నాటికి నష్టాల్లో ఉంది.


గ్లోబల్ హెల్త్ (మేదాంత) ఒక హై-ప్రొఫైల్ IPO. నవంబర్ 3న బిడ్డింగ్ కోసం ఓపెన్‌ అయింది. దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌లలో ఇది ఒకటి కావడంతో, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. రూ. 336గా ఉన్న పబ్లిక్‌ ఇష్యూ ధర, లిస్టింగ్ రోజున 23 శాతానికి పైగా పెరిగింది.


సూల వైన్‌యార్డ్స్‌ IPO బిడ్డింగ్ డిసెంబర్‌లో ఓపెన్‌ అయింది. వైన్ పరిశ్రమలో, ఈ తరహా కంపెనీల్లో మొదటి IPOగా వచ్చింది. భారతదేశపు అతి పెద్ద వైన్‌ తయారీ కంపెనీగా భారీ హైప్‌ సృష్టించినప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి మ్యూటెడ్‌ రెస్పాన్స్‌ మాత్రమే వచ్చింది. ఎందుకంటే.. IPOలో అమ్మకానికి పెట్టిన షేర్లలో ఒక్క ఫ్రెష్‌ షేర్‌ కూడా లేదు. అన్నీ ఆఫర్ ఫర్ సేల్‌ షేర్లే.


ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ IPO సైజ్‌ చాలా చిన్నది, కేవలం రూ. 33.97 కోట్లను ఈ కంపెనీ సేకరించింది. అయినా, భారీ స్పందనను చూసింది. ఈ IPO మొత్తం 243.7 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది, పెట్టుబడిదార్లు అత్యధికంగా వెంటబడిన IPOగా నిలిచింది. 90% ప్రీమియంతో లిస్ట్‌ అయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.