Tirumala News : శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుమలలో టీటీడీ అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.  అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక ఉన్న 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1న సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు. 


నిరంతరాయంగా టోకెన్లు 


10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులలో ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 


జనవరి 1 నుంచి సర్వదర్శనం టోకెన్లు


జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ కేటాయించింది. భక్తులు ఈ టికెట్లను పొందొచ్చు. జనవరి 1న సర్వదర్శనం టికెట్ల జారీ ఉంటుంది. అంతేకాదు వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు సామాన భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని టీటీడీ చెబుతోంది.  ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు. అలాగే రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోరు.