Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని తెలిపింది. 


రేపు ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 


శ్రీవారి భక్తులకు ఏప్రిల్ 25న మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్లైన్ లో విడదల చేయనుంది టీటీడీ. ఇందుకోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లోనే బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. వీఐపీ బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైం స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం, ఆర్జిత సేవ వంటి పద్దతుల్లో టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ, సీనియర్ సిటిజన్స్, ప్రత్యేక ప్రతిభావంతులు సంబంధించిన టోకెన్లను ఆన్లైన్ ద్వారా ఒక‌ నెలకు ముందే టిక్కెట్లను జారీ చేస్తుంది. అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు, సామాన్య భక్తులు ముందస్తుగా టోకెన్లను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుని తిరుమలకు‌ వచ్చే విధంగా సులువుగా ఉండే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. అయితే ఇలా ఆన్లైన్ లో దర్శన టోకెన్లు పొందే భక్తులకు సౌఖర్యార్ధం, గదులను సైతం ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే వెసులుబాటును కలపిస్తుంది. అయితే ఇటీవల అమాయకులైన భక్తులను టార్గెట్ చేసుకుని కొందరు అక్రమార్కులు తిరుమల తిరుపతి‌ దేవస్థానం పేరుతో నకిలీ వెబ్ సైట్లను సృష్టించి భక్తులను నట్టేట ముంచేస్తున్నారు. 


నకిలీ వెబ్ సైట్లపై అప్రమత్తం 


నకిలీ వెబ్ సైట్ లను ఆశ్రయించి మోసపోతున్న భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో పాటుగా భక్తుల నుంచి అధికంగా ఫిర్యాదులు రావడంతో నకిలీ వెబ్‌సైట్లపై ప్రత్యేక దృష్టి సారించింది టీటీడీ. భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్ సైట్ లను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు పెట్టింది. దాదాపుగా 41 నకిలీ వెబ్ సైట్‌లను గుర్తించిన టీటీడీ వాటి వివరాల సేకరించి, వాటిని ఆపరేటర్ చేసే వ్యక్తులను గుర్తించే పనిలో పడింది.  ఇందుకు నకిలీ వెబ్‌సైట్ వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు‌ పంపింది. టీటీడీ ఆన్లైన్ టిక్కెట్లు, గదుల కేటాయింపు‌ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొందరు‌ కేటుగాళ్లు కొత్తకొత్త ఆలోచనలతో అమాయకులైన భక్తులను మోసగిస్తున్నారు. ఇందుకే టీటీడీ ఎప్పటికప్పుడు నకిలీ‌ వెబ్సైట్ ల పట్ల భక్తులు అప్రమత్తం చేస్తూనే ఉంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే టికెట్లు, గదుల కేటాయింపుల ప్రక్రియను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలోనే మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించింది.