Ananthapuram news: అనంతపురం జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇంటి వద్ద ఆటుకుంటున్న మూడేళ్ల చిన్నారి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయింది. తమ కళ్ల ముందే విగతజీవిగా మారిన చిన్నారిని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మూడేళ్లకే తమ బిడ్డకు నూరేళ్లు నిండాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నారి మృతదేహం వద్ద నిస్సహాయంగా ఉన్న వారిని చూసిన స్థానికులు శోక సంద్రంలో మునిగిపోయారు. 


ఇదీ జరిగింది


గుంతకల్లు మండలం దంచర్ల గ్రామంలో భీమ, మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి మూడేళ్ల చిన్నారి ఉంది. ఆదివారం ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న చిన్నారి సిద్దార్థ ఆవరణలోని విద్యుత్ స్తంభాన్ని తాకింది. ఈ క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన తల్లిదండ్రులు పాపను వెంటనే గుంతకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు


అటు బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలో కింద పడిన భార్యభర్తలు రామాంజనేయులు (35), అనిత (27) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ డ్రైవర్ బస్సు వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కృష్ణా జిల్లాలోనూ


మరోవైపు, కృష్ణా జిల్లాలో ఓ పాఠశాల బస్సు పంట కాలువలో బోల్తా పడింది. అవనిగడ్డలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు, కోడూరు మండలం, విశ్వనాథపల్లె సమీపంలో అదుపు తప్పి కాలువలో పడిపోయింది. స్టీరింగ్ రాడ్ విరగడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్సులోని విద్యార్థులు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అవనిగడ్డ నుంచి కోడూరు వరకూ రహదారి మరమ్మతులకు గురి కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. 


విజయవాడలో బస్సు బీభత్సం


విజయవాడలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఓ మహిళ, చిన్నారి ఉండగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్ క్లర్క్ ను గుంటూరు - 2 డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్ (18 నెలలు)కు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మహిళ కాలు విరగ్గా, బాలుడు మృతి చెందాడు.


రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్


బస్సు డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి 11, 12 ప్లాట్ ఫాంల వద్ద రెయిలింగ్ తో పాటు, ప్లాట్ ఫైం ఉన్న కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా బస్సు పైకి రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


సీఎం దిగ్భ్రాంతి


బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.


మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా


ఈ ఘటన దురదృష్టకరమని, బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులున్నారని, బస్సు బయల్దేరే ముందు ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన 24 గంటల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై పూర్తి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని, ప్రమాదానికి మానవ తప్పిదమా.? లేదా సాంకేతిక కారణాలా? అనేది విచారణలో తేలుతుందన్నారు.