ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అసెంబ్లీలో సీఎం జగన్ డిసెంబర్ 17, 2019న వెల్లడించడం..ఆ తర్వాత చకచకా జరిగిన పరిణామాలతో తేలిపోతుంది. అమరావతికి భూములిచ్చిన రైతులు ఎన్ని ఉద్యమాలు చేసినా వారిపై లాఠీ విరిగింది కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు మంచి నిర్ణయం కాదన్నా పట్టు వదలలేదు. ఏ క్షణమైనా విశాఖకు అని నిన్నామొన్నటి వరకూ చెబుతూ వస్తున్నారు. కానీ హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఇప్పుడు మూడు రాజధానులపై ఆసక్తి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోగా  ప్రస్తుత రాజధానికి అనుసంధానమయ్యే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో వేగం పెరుగుతోంది. 


3 రాజధానుల ప్రస్తావన చేయని సీఎం జగన్..!


ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత అందరికీ ఒకటే అనుమానం వచ్చింది. అదే మూడు రాజధానుల గురించి జగన్ ప్రస్తావించకపోవడం. మూడు రాజధానులు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం జగన్ సందర్భం వచ్చినప్పుడల్లా మూడు రాజధానుల నిర్ణయాన్ని చెప్పి.. ఎందుకు చేయాలనుకుంటున్నామో వివరించేవారు. వేగంగా మూడు రాజధానులు చేస్తామని చెబుతూ ఉండేవారు. కానీ ఈ ఆగస్టు 15కి మాత్రం ఆ మాటలు మిస్సయ్యాయి. అయితే మూడు రాజధానులపై జగన్ పట్టుదలను గతంలో చూసిన వారు పొరపాటున స్పీచ్‌లో ఆ పార్ట్ మిస్సయిందేమో అనుకున్నారు. కానీ పొరపాటున కాదని..కావాలనే మూడు రాజధానుల నిర్ణయంపై స్పందించడం తగ్గించారని తర్వాతి పరిణామాలతో తెలుస్తోంది. హైకోర్టులో రాజధాని పిటిషన్లపై విచారణ కావాల్సిందేనని గతంలో పట్టుబట్టిన అడ్వకేట్ జనరల్ .. సోమవారం నాటి విచారణలో వాయిదా వేసినా అభ్యంతరం లేదని చెప్పారు. ప్రభుత్వం వ్రభుత్వం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేస్తోందన్న అబిప్రాయం అందరిలోనూ బలంగా ఏర్పడుతోంది.


రాజధాని ప్రాంతంలో భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు..! 


మూడు రోజుల కిందట అనంతపురం నుంచి గుంటూరు వరకు 418కిలోమీటర్ల మేర రహదారిని రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం అంటే భారత జాతీయ రహదారుల సంస్థ చేపట్టే ప్రాజెక్ట్. ఇది గత ప్రభుత్వం అనుమతి తీసుకు వచ్చిన రహదారి. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత ఏపీ ప్రభుత్వం వీటి పనుల్ని ఆపివేయించింది. ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకు వచ్చారు. అనంతపురం - అమరావతి అనుసంధానానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను రూపొందించింది. సీఎం జగన్ ఆమోదంతో కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆ శాఖ ఆమోదం తెలిపింది. కొత్తగా బెంగళూరు -విజయవాడ రహదారిని పట్టాలెక్కిస్తున్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రెండే కాదు.. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల్ని అంగీకరించని ప్రభుత్వం ఇటీవల హఠాత్తుగా ఆమోదించింది. రూ. 29 కోట్ల 40  లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు భవనం కార్యకలాపాలకు సరిపోవడం లేదు. దీన్ని విస్తరించాలన్న ప్రతిపాదనలు మొదటి నుంచి ఉన్నాయి. 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే న్యాయరాజధానిని కర్నూలుకు తరలించాలన్న ఉద్దేశంతో ఇంత కాలం ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టారు. కారణం ఏమిటో కానీ ఇప్పుడు హైకోర్టు విస్తరణకు ప్రభుత్వం అంగీకరించింది.


నాడు సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చన్న బొత్స..నేడు కోర్టు ఆమోదం మాట..!


ఓ వైపు ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనలు తగ్గించింది. మరో వైపు మౌలిక సదుపాయాల పనులు ప్రారంభిస్తామని చెబుతోంది. అదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజధాని అంశంపై భిన్నంగామాట్లాడటం ప్రారంభించారు. గతంలో కోర్టులతో సంబంధం ఏముందని సీఎం జగన్ ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని.. సీఎం ఎక్కడి నుంచి పరిపాలించాలనేది కోర్టులు చెప్పలేవని వాదించేవారు. కానీ ఇప్పుడు మాట మారింది. హైకోర్టు అనుమతితోనే రాజధానిని మారుస్తామని చెప్పారు. అంటే.. హైకోర్టులో కేసులు తేలే వరకూ రాజధాని మార్చరని బొత్స సత్యనారాయణనే నేరుగా చెప్పినట్లయింది.


ఎన్నికల్లో  రాజధాని అంశమే ఎజెండాగా మార్చే వ్యూహమా..?  


రాజకీయంగా ఆలోచించే సీఎం జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులపై  వెనుకడుగు వేసినట్లుగా భావిస్తున్నారు. ఎన్నికల వరకూ ఈ వివాదాన్ని సాగదీసి..  మూడు రాజధానుల అజెండాను ఎన్నికల్లో హైలెట్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి వాటి కన్నా మూడు రాజధానులకే మద్దతు లభిస్తుందని అధికార పార్టీ వ్యూహంగా ఉందని.. అందుకే వెనక్కి తగ్గారని అంటున్నారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ బ్యాక్ ఫుట్ వేసిందన్నది నిజం.. అయితే అది బలంగా ముందుకొచ్చి కొట్టడానికా..? లేక ప్రస్తుతానికి డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారా అన్నది ముందు ముందు పరిణామాలతో తేలే అవకాశం ఉంది.