కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డలో రాజకీయాలు వేడిని పుట్టిస్తాయి. ఎన్నికలు రాక ముందే ఆళ్ళగడ్డలో నువ్వా నేనా అంటూ నాయకులు సవాళ్లు విసిరుకుంటున్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన రాజకీయ ప్రత్యర్ధి తమ్ముడిని టార్గెట్ చేశారు. తమ్ముడిపై కేసులు పెడితే చూస్తూ ఊరుకుంటానా అంటు రంగంలోకి దిగారు లేడీ లీడరు. ఆమె నేరుగా సీన్‌లోకి రావడంతో ఆళ్లగడ్డలో హీట్‌ మొదలైంది. అభివృద్ది పనుల పేరుతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఆధారాలతో సహా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్ధి విసిరిన సవాల్‌కు ఎమ్మెల్యే సై అన్నారు. 


 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మున్సిపాలిటీ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలి ప్రాంతంలో రోడ్ల విస్తరణ, మురుగు కాల్వల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విస్తరణ పనుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కట్టించిన బస్‌ షెల్టర్‌తోపాటు, పబ్లిక్‌ ప్రాపర్టీస్‌ను అధికారులు కూల్చేశారు. ఇక్కడ వివాదం మొదలైంది.


ప్రజల కోసం కట్టించిన ప్రాపర్టీలను కూల్చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. కట్టడాలు కూల్చి వేస్తుండగా భూమా నాగిరెడ్డి కుమారుడు, టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అడ్డుకున్నారు. 


డ్రైనేజీ పనుల కోసం తొలగిస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. కాల్వలు రోడ్ల పక్కన కింద ఉంటే బష్ షెల్టర్ కూల్చడం ఏంటని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రశ్నించారు. పనులకు ఆటంకం కలిగిస్తున్నారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి ఇద్దర్నీ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. భూమా జగత్ విఖ్యాత్ పై కేసు పెట్టారు.


తమ్ముడు జగత్ విఖ్యాత్‌పై కేసు పెట్టడంతో సీన్‌లోకి ఎంటర్‌ అయ్యారు మాజీమంత్రి భూమా అఖిల ప్రియ. పోలీసులపై సీరియస్ అయ్యారు. ప్రజల కోసం బస్ షెల్టర్ కట్టిస్తే దాన‌్ని కూల్చి వేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది దుర్మార్గమన్నారు. పబ్లిక్ ప్రాపర్టీస్‌ను ఇష్టారాజ్యంగా కూల్చివేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె మండిపడ్డారు.
  
రహదారుల విస్తరణ, మురుగు కాల్వల పనులంటూ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని అఖిల ప్రియ ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారిని వదిలేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిపైన తీవ్ర విమర్శలు చేశారు అఖిల ప్రియ. ఎమ్మెల్యే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. బాధ్యత వహించి ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తారా అని అఖిల ప్రియ సవాల్ చేశారు. అంతేనా ఎమ్మెల్యే అక్రమాలను నిరూపించలేక పోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.


భూమా అఖిల ప్రియ ఛాలెంజ్‌ను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వెంటనే స్వీకరించారు. ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆళ్లగడ్డ రాజకీయం వేడి పెరిగింది. ఎమ్మెల్యే అక్రమాలు వైసీపీ పెద్దలకు, పబ్లిక్‌కు ఎక్కడ తెలుస్తాయో అన్న భయంతో ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి తన తమ్ముడిపై కేసులు పెట్టించారని భూమా అఖిల ప్రియ అన్నారు. 
        
ఆళ్లగడ్డలో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు భూమా అఖిల ప్రియ. తాను కూడా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి అన్నారు. ఇద్దరు నేతలు కలెక్టర్ వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్‌గా మారాయి.


అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడం, ఎమ్మెల్యే అక్రమాలను బయటపెట్టి తీరుతానని భూమా అఖిల ప్రియ శపథం చేశారు. దీంతో ఎమ్మెల్యే కూడా భూమా అఖిల ప్రియ ఆరోపణలు అవాస్తవమని నిరూపించే ప్రయత్నాలను మొదలు పెట్టారట. దూకుడుగా వెళ్తున్న భూమా అఖిల ప్రియకు జిల్లా టిడిపి నేతలు సైతం మద్దతుగా నిలిచారు. మొత్తంగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీ కాల్వల పనులపై వచ్చిన ఆరోపణల్లో ఎవరు పై చేయిగా నిలుస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.