అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలూరు కోన శ్రీ రంగనాథ స్వామి రథోత్సవానికి వెళ్తున్నా  మున్సిపల్ ఛైర్మన్‌ జె.సి ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
 
తనను పోలీసులు అడ్డుకోవడంపై జేసీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. రథోత్సవాలకు కూడా వేరే వాళ్లను అనుమతించరా అంటూ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. 


జేసిని అడ్డుకోవడంపై ఆయన అభిమానులు కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డిని రథోత్సవానికి అనుమతి ఇవ్వలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, జేసీ వర్గీయుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. 


వేడుకలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని అందుకే ప్రస్తుతానికి కార్యక్రమానికి పంపించలేమంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డికి వివరించారు పోలీసులు. ఫ్యాక్షన్ గ్రామం కావడంతో రిస్క్‌ తీసుకోలేమంటూ వివరించే ప్రయత్నం చేశారు.  


పోలీసుల వివరణతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం. రథోత్సవానికి హాజరై తీరుతామని... ఎంతటైం అయినా అనుమతి ఇవ్వాల్సిందేనంటూ పట్టు బట్టింది. రథోత్సవానికి హాజరు కాకుండా వెనుదిరిగే ప్రసక్తి లేదంటూ గట్టిగా పోలీసులతో గొడవకు దిగారు. 


అలా సాగదీస్తే పరిస్థితి అక్కడే ఉద్రిక్తతకు దారి తీసేలా ఉందని గమనించిన పోలీసులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఎమ్మెల్యేను త్వరగా అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌ రెడ్డి సహా ఆయన అనుచరులను రథోత్సవానికి అనుమతి ఇచ్చారు. 


స్వతహాగా ఫ్యాక్షన్ గ్రామమైన ఆలూరులో ముందస్తుగానే పోలీసులు భారీగా మోహరించారు. వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించి జాతర సజావుగా సాగేలా ప్లాన్ చేశారు. 


ఈ మధ్య కాలంలో జేసీ దివాకర్‌ రెడ్డి దూకుడు పెంచారు. ఎప్పుడూ జనంలో ఉండే ఆయన బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఆ యాత్రకు సొంత పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా విమర్శలు చేశారు. కొందరు జిల్లా నేతలు తనను టార్గెట్‌గా చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ పంచాయితీ పార్టీ చీఫ్ చంద్రబాబు వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి చంద్రబాబు స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కొందరు లీడర్ల మూలంగా అది ముందుకు వెళ్లడం లేదంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు బస్సు యాత్రపై కూడా చంద్రబాబు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి