Anna Canteen :  ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రాజకీయ విశ్లేషకులు సైతం అవాక్కయ్యేలా.. రికార్డు విక్టరీతో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  వైసీపీ ప్రభుత్వం ఆపి వేసిన అనేక పనులను తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పినట్లుగానే  టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో  చెప్పిన పనులు తిరిగి పూర్తి చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.  


2014లో టీడీపీ పాలన ఎలా ఉండేదో ఆ విధంగా మార్పులు మొదలయ్యాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే.  కూటమి ప్రభుత్వం ఇలా వచ్చిందో లేదో.. మళ్లీ అన్న క్యాంటీన్లకు కళొస్తుంది. నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలన్న సంకల్పంతో  చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమవుతున్నాయి.  


వైసీపీ హయాంలో  మూసివేత
అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే పెద్దలకు పట్టెడు అన్నం పెట్టినవి వైసీపీ  ప్రభుత్వం రాగానే మూతపడ్డాయి.  టీడీపీ హయాంలో పలుచోట్ల ఆ పార్టీ నేతలు స్వయంగా వీటిని ప్రారంభించి, విజయవంతంగా నడిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి నిరుపేదలకు పట్టెడు అన్నం దొరకకుండా చేసింది. దీంతో  అనేకమార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. 


అధికారంలోకి వస్తే క్యాంటీన్లు తెరుస్తామన్న చంద్రబాబు  
 2014లో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు.. మొదలు పెట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు 7.25 కోట్ల మందికి భోజనం పెట్టాయి. టీడీపీ హయాంలో చాలా బాగా నడిచి పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే  పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేతలు, సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పిన విషయం తెలిసిందే.


 అన్న క్యాంటీన్ ల పునరుద్ధరణ
ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం ఏపీ వాసులకు పట్టలేని సంతోషాన్ని కలిగిస్తోంది.  ఇప్పటికే ఏపీలోనే అనేక ప్రాంతాలలో మూసివేతకు గురైన అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసి శుభ్రం చేసి నిర్వహించేందుకు సిద్ధం చేస్తుండగా..  తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 64వ జన్మదినం సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ ను పున:ప్రారంభించారు. 






బాలయ్య బర్త్ డే కానుక.. హిందూపురంలో తొలి అన్నా క్యాంటీన్ 
టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో బాలకృష్ణ తన పుట్టినరోజు నాడు రాష్ట్రంలో మొట్టమొదటి అన్న కాంటీన్ ను  ప్రారంభించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. తన నియోజకవర్గ పరిధిలో  ప్రారంభించిన అన్న క్యాంటీన్ లు అన్నార్థులకు బాసటగా ఉంటాయన్నారు. క్యాంటీన్లో నాణ్యమైన భోజనం రూ. 5 లకే లభిస్తుందని తెలిపారు.