అనంతపురం/హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల రోజు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం నాడు టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడటం, వేలాదిగా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడంతో వారిని పోలీసులు కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. తాడిపత్రిలో 144 సెక్షన్ విధించిన పోలీసులు, కీలక నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సైతం అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పంపించారు. 


జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాదులోనే కాంచన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాడిపత్రిలో మంగళవారం నెలకొన్న ఉద్రిక్తత సమయంలో పోలీసులు ప్రయోగించిన బాష్ప వాయువుతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఆయన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.