Bandaru Satyanarayana Murthy: తెలుగు దేశం పార్టీ పాలన సమయంలో తాము ఎక్కడ భూ ఆక్రమణలు చేశామో వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు నిరూపించాలని తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సవాల్ విసిరారు. టీడీపీ నేతలు ఆక్రమణలు చేశారన్న విజయసాయి రెడ్డి, ఎక్కడి భూములు కబ్జా చేశారో చూపించాలని నిలదీశారు. తాను ఏ భూములు కబ్జాలు చేయలేదని విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని సాయి బాబా ఆలయంలో ప్రమాణం చేసి మరీ చెప్తానని అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. 


"దోచేస్తే చూస్తూ ఊరుకునేది లేదు"


రేడియంట్ భూములు విషయంలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి  విమర్శలు గుప్పించారు. "విశాఖను దోచుకుంటున్నారు. అలా దోచేస్తే చూస్తూ ఉరుకొము. మమ్మల్ని జైలుకు పంపినా పోరాటంలో వెనకడుగు వెయ్యం. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ్ముడు అనిల్ రెడ్డి తో క్యాపిటల్ ఎక్స్ ప్రొజెక్టు పేరుతో పెద్ద భూ మాయకు దిగారు. విశాఖ లో పారిశ్రామిక వేత్తలని బెదిరించి ఆస్తులు లాక్కుంటున్నారు. ఎందుకు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షాను బదిలీ చేశారో చెప్పాలి. వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు మేము 5 వేల కోట్లు ఆస్తులు ఆక్రమించుకున్నామని విజయసాయి ట్వీట్ చేశారు. మేము ఎక్కడ ఆక్రమించుకున్నామో, అక్రమాలు చేశామో చెప్పాలి" అని సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. 


"ప్రమాణం చేసి నిజం చెప్పాలి"


"నేను షిర్డీ సాయి భక్తుడను. ఈస్ట్ పాయింట్ కాలనీ సాయి బాబా గుడి దగ్గర ప్రమాణం చేస్తా. ఎక్కడ కబ్జా చేశామో వచ్చి విజయ సాయి రెడ్డి చెప్పాలి. ఆయన ఎప్పుడూ చెబితే అప్పుడు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయి బాబా గుడి దగ్గరకు రావడానికి నేను సిద్ధం. మా పై భూ అక్రమాలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాం. మరి అవాస్తవం అని తేలితే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. విశాఖలో ప్రజలు తొందరపడి భూములకు ఏ అగ్రిమెంట్లు చేసుకొద్దు" అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఈ సమావేశంలో  బండారు సత్యనారాయణ మూర్తితో పాటు విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు  బైరెడ్డి పోతన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేడియంట్‌ భూముల వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ కు వరుసకు సోదరుడైన అనిల్‌రెడ్డి, సీఎం సతీమణి భారతిరెడ్డి ప్రోద్బలంతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఇందులో హస్తం ఉందని ఆరోపించారు. రేడియంట్‌ సంస్థకు చెందిన రమేష్‌ కుమార్‌కు సర్వే నంబరు 336లో 50 ఎకరాల భూములను అప్పగించాలని, అందుకు ఆయన వీఎంఆర్‌డీఏకు రూ.93 కోట్లు చెల్లించాలని 2019లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో రిజిస్ట్రేషన్ జరగలేదని, ఆ తరువాత ఏపీలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం రేడియంట్ భూములను ఆక్రమించుకోవాలని చూసిందని ఆరోపించారు.