Nara Lokesh: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో ఆయన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. సోమవారం కారంపూడిలో బహిరంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ వైఫల్యాలపై లోకేష్ నిప్పులు చెరిగారు.  


చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతల దాడులు ఎస్పీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషాంత్ రెడ్డికి ఆపరేషన్ చేయించి అన్నీ కనిపించేలా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని విమర్శించారు. మహిళల కోసం దిశ చట్టం పేరుతో డమ్మీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. గన్ కంటే ముందు జగన్ వస్తారని వైసీపీ మహిళా నేతలు అన్నారని, కానీ సీఎం పనితీరు చూస్తే ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైందన్నారు. మహిళల సంరక్షణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పనికిరాని చట్టాలతో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. 


వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ సానుభూతిపరుడు, ఉప సర్పంచ్ ముగ్గురు మహిళలపై దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నడి రోడ్డుపై మహిళలను కొట్టి మళ్లీ వారిపైనే ఎదురు కేసు పెట్టారని ఆరోపించారు. పూటకో అత్యాచారం, రోజుకో హత్య రాష్ట్రంలో జరుగుతోందని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని మండిపడ్డారు. 


లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని, వెయ్యి రూపాయల విలువైన వాటర్ బాటిల్‌ నీరు తాగుతూ.. తాను పేదవాడినని జగన్‌ చెబుతున్నారని, నాలుగో చోట్ల రాజ భవనాలు ఉన్న జగన్.. పేదవారా? అంటూ లోకేస్ ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు నాలుగు సార్లు, ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచి ప్రజలను బాదుతున్నారని అన్నారు. చెత్తపై పన్ను వేసే చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. ప్రతి చోటా ఫొటో వేసుకునే జగన్ కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లుపై ఎందుకు వేసుకోరని ప్రశ్నించారు. 


దేశ రాజకీయాలను శాసించిన చంద్రబాబు హై వోల్టేజ్ అని ఆయన్ను ముట్టుకుంటే షాక్ తప్పదని లోకేశ్‌ హెచ్చరించారు. అధికార పక్షం నేతలే బంద్‌కు పిలుపునిచ్చే వింత పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతగాని జగన్.. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయిస్తున్నారనని మండిపడ్డారు. 


అంతకు ముందు ఆయనకు కారంపూడిలో ఘన స్వాగతం పలికారు. పలువురు విద్యార్థులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కారంపూడి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటర్‌, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని లోకేష్‌ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గతంలో అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేశారని ఆరోపించారు.


టీడీపీ అధికారంలోకి రాగానే కారంపూడిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీ కాలేజి అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరప్రాంతాల్లో చదవాల్సి వచ్చినా... వారిపై ఎటువంటి భారంపడకుండా రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు.