Chandrababu Comments in Madugula Meeting: రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమని.. ఈ ఎన్నికల్లో జగన్ పాలనకు అంతం పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrbabu) ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో (Madugula) నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో ఆయన మాట్లాడారు. ఇంకో 64 రోజుల్లో టీడీపీ (TDP) - జనసేన (Janasena) ప్రభుత్వం రాబోతోందని అన్నారు. సీఎం జగన్ బటన్స్ నొక్కుతున్నానని గొప్పులు చెప్పుకొంటున్నారని.. 'బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి.?' అని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని గుర్తు చేశారు. 'ఈ ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజలు గెలవాలి. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్ లేదు. ఇలాంటి సీఎంను నా జీవితంలో నేను చూడలేదు. ప్రజలపై భారం వేసిన గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. ఆయన బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8 లక్షలు నష్టపోయింది. కరెంట్ ఛార్జీలు పెంచి రూ.64 వేల కోట్ల భారం ప్రజలపై మోపారు. జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు.?' అని ప్రశ్నించారు. జగన్ ది ఉత్తుత్తి బటన్ నొక్కుడని.. జాబు కావాలంటే బాబు రావాల్సిందే అని పునరుద్ఘాటించారు.










'జగన్ ఓటమి ఖాయం'


జగన్ బటన్ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని.. ఎన్నికల్లో రేపు ప్రజలంతా ఒకే బటన్ నొక్కుతారని, ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయమని చంద్రబాబు అన్నారు. 'మైనింగ్ బటన్ నొక్కి భూగర్భ సంపద దోచేశారు. ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి సంపద తరలించారు. ధన దాహంతో జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశారు. రుషికొండను అనకొండలా మింగేశారు. విశాఖలో రూ.40 వేల కోట్లు దోచుకున్నారు. రూ.500 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. తన సలహాదారులకే రూ.150 కోట్లు దోచిపెట్టారు. విశాఖ ఉక్కుపై సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖను గంజాయి కేంద్రంగా.. క్రైమ్ సిటీగా మార్చేశారు.' అంటూ మండిపడ్డారు. 


అనంతరం చింతలపూడి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్ ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని.. ఆయన్ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారని.. అర్జునుడిని అని చెప్పుకొంటున్న జగన్.. అక్రమార్జునుడు అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ధ్వజమెత్తారు. 


Also Read: YSRCP : చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ - మరో దళిత నేత రాజీనామా