Another Dalit leader resigned from YSRCP :  చిత్తూరు జిల్లా వైసీపీకి  వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ రాజీనామా చేశారు.  మెయిల్ ద్వారా జగన్ రెడ్డికి రాజీనామా పంపిపిన మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ  మీడియా సమావేశంలో వైసీపీ హైకమాండ్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.  
12 ఏళ్లుగా వైసీపీలో ఉన్నారు ఆర్. గాంధీ.  వైసీపీ లో దళితులకు అన్యాయం జరుగుతోందని..  దళితుల బాధలను, కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటే అపాయింట్మెంట్ దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  గత నెల రోజుల్లో సుమారు వెయ్యి సార్లు జగన్ రెడ్డికి కాల్ చేశాను కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. 


12 ఏళ్లుగా వైసీపీలో ఉన్న  ఆర్.గాంధీ                                   


ఓ దళిత మాజీ ఎమ్మెల్యేని అయిన నాకు వైసీపీలో అవమానం జరిగింది. దీంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానని ప్రకటించారు.  నాడు అమర్నాథ్ రెడ్డి   ఆధ్వర్యంలో నేను వైసీపీలో చేరాను.  అప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తనను చిన్నచూపు చూస్తూ వస్తున్నారని విమర్శించారు.  పార్టీ పరంగా దక్కాల్సిన అవకాశాలను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దూరం చేస్తూ, అడ్డుపడుతూ వచ్చారని..  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితుల పైన, బీసీల పైన దాడులు పెరిగాయిని  విమర్శించారు.  వైసీపీ చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా నేడు నేను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. 


పెద్దిరెడ్డికి బానిసత్వం చేసే వారికే టిక్కెట్లు                             


చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గంగాధర నెల్లూరులో జరగనున్న  రా... కదలిరా... సభలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాననని తెలిపారు.  దళితులకు ఈ ప్రభుత్వం దగా చేస్తుంది, దీనిని ప్రశ్నించేందుకు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను.  నేడు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం నడుస్తోందన్నారు.  పెద్దిరెడ్డికి బానిసలుగా ఉన్నారో, అనుకూలంగా ఉన్నారో వారికి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీట్లు వస్తున్నాయని మండిపడ్డారు.  జిల్లాలో వైసీపీకి  కోనేటి ఆదిమూలం గొప్ప సర్వీస్ చేశారు. అలాంటి దళిత నాయకుడికి కూడా టికెట్ ఇవ్వలేదన్నారు.  పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకి కూడా సీటు లేకుండా చేశారు.  వైసీపీలో కేవలం దళిత ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు.  వైసీపీ చేస్తున్న అవినీతి, అక్రమాల మీద పోరాటం చేస్తానని  ప్రకటించారు. 


చిత్తూరు జిల్లా వైసీపీలో టిక్కెట్ల మార్పు కలకలం     


చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో టిక్కెట్ల మార్పు వ్యవహారం కలకలం రేపుతోంది. ముందుగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను మార్చడం వివాదాస్పదమవుతోంది. డిప్యూటీ సీఎంకు కూడా మొదట ఎంపీ టిక్కెట్ ప్రకటించి తర్వాత ఎమ్మెల్యేగా మార్చారు. సత్యవేడు ఎమ్మెల్యేకూ అదే విధంగాచేయడంతో ఆయన మనస్తాపానికి గురై టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.