Byjus financial problems: బైజూస్(Byjus) .. భారత్‌(India) సహా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ స్టార్టప్‌(Edu Tech Startup)గా పేరుగాంచిన సంస్థ‌. ముఖ్యంగా డిజిట‌ల్(Digital) విద్యా బోధ‌న‌లో అనేక కొత్త పుంత‌లు ప్ర‌వేశ పెట్టి విద్యార్థుల‌కు చేరువైంది. ఏపీ స‌హా హ‌రియాణ‌, యూపీ వంటి రాష్ట్రాలు బైజూస్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. త‌ర్వాత కాలంలో ఇత‌ర రాష్ట్రాలు ఈ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకున్నాయి. కానీ, ఏపీ మాత్రం ఇంకా కొన‌సాగిస్తోంది. అయితే.. గ‌త కొన్ని నెల‌లుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సిబ్బందికి వేత‌నాలు చెల్లించేందుకు సంస్థ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి ర‌వీంద్ర‌న్ బెంగ‌ళూరులో ఉన్న త‌న భ‌వంతిని, ముంబైలో ఉన్న ఇళ్ల స్థ‌లాల‌ను కూడా ఇటీవ‌ల అమ్ముకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. 


తాజాగా ఈ సంస్థ‌ దివాలా దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల వరుసగా బైజూస్(Byjus) వివాదాల్లో చిక్కుకుంది.  రుణం చెల్లించలేక అవస్థలు పడుతోంది. మళ్లీ నిధుల వేటలో ఉంది. బోర్డు డైరెక్టర్లు ఒకేసారి ముగ్గురు రాజీనామా చేశారు. బైజూస్ ఫౌండర్ రవీంద్రన్(Ravindran) వైఖరిపై అందరిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వరుసగా వందలాది ఉద్యోగులను కూడా తొలగించింది. ఇటీవల బెంగళూరులో తన అతిపెద్ద ఆఫీస్‌ను ఖాళీ చేసింది. ఇది 5 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న భారత్‌లోనే తన అతిపెద్ద ఆఫీస్ కావడం గమనార్హం.  


తాజాగా.. ఏం జ‌రిగింది?


ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న బైజూస్‌(Byjus) తమ ఉద్యోగుల జనవరి నెల వేతనాలు చెల్లించింది. అయితే.. ఈ వేత‌నాలు చెల్లించేందుకు నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింద‌ని స్వయంగా సీఈఓ రవీంద్రన్‌ (Byju Raveendran) వెల్లడించారు. ‘‘సోమవారం వరకు వేతనాలు అందుతాయని మీకు సమాచారం ఉందని తెలుసు. మీలో చాలా మంది నా పరిస్థితిని అర్థం చేసుకొని మరికొంత కాలమైనా వేచి ఉంటామని లేఖ రాశారు. కానీ, సోమవారం వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. వేతనాలు చెల్లించడానికి గత కొన్ని నెలలుగా నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. చట్టబద్ధంగా అర్హత కలిగిన వేతనాన్ని మీరు పొందేలా చూసుకోవడానికి ఈసారి మరింత పోరాడాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు. ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. మనం నిర్మించుకున్న దానిపై మనకున్న నమ్మకమే దీనికి కారణం. ఆత్మగౌరవం ఉంటే.. అన్నీ ఉన్నట్లే’’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో రవీంద్రన్ తెలిపారు. 


నెల‌కు 70 కోట్ల వేత‌నాలు.. 


బైజూస్ సంస్థ నెల నెలా త‌న ఉద్యోగుల‌కు చెల్లించే వేత‌నాలు(Sallaries) మొత్తం 70 కోట్ల రూపాయ‌లు(70 Crore Rupees) ఉన్నాయ‌ని స‌మాచారం. అయితే.. ఆర్థిక చిక్కుల‌తో ఈ సంస్థ దివాలా దిశ‌గా అడుగులు వేయ‌డంతో వేత‌నాలు చెల్లించేందుకు ఇక్క‌ట్లు ప‌డుతోంది. మరోవైపు సీఈఓ రవీంద్రన్‌ను తొలగించేందుకు ఇన్వెస్టర్లంతా ఏకమయ్యారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన బైజూస్ సంస్థ‌ ఇన్వెస్టర్లకు అలాంటి హక్కు లేదని తెలిపింది.  


క‌రోనా స‌మ‌యంలో వెలిగి.. 


బైజూస్.. ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూట్ ఎడ్యుకేషనల్(Educational) టెక్నాలజీ స్టార్టప్. ఇది కరోనా సమయంలో ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో అందరూ ఇంటికే పరిమితం అవడంతో.. ఆన్‌లైన్ క్లాసుల ద్వారా అందరికీ పరిచయమైంది. అయితే ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికితోడు ఆరోప‌ణ‌లు రావ‌డంతో విద్యార్థుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. దీంతో బైజూస్ ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంది. ఈ ఏప్రిల్‌లో విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బైజూస్ బెంగళూరు కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. ఇదే క్రమంలో బైజూస్ ఫౌండర్, సీఈఓ రవీంద్రన్ కన్నీళ్లు పెట్టుకున్నారని వార్త‌లు కూడా వ‌చ్చాయి. 


విశ్వ‌స‌నీయ‌త‌పై దెబ్బ‌!


కంపెనీలో తీవ్రమైన కార్పొరేట్ గవర్నెన్స్(Governence) లోపాలు బయటపడ్డాయి. దీంతో విశ్వసనీయత కూడా తగ్గిపోయింది. ఇక ఇంతకుముందు సేకరించిన నిధుల్ని చెల్లించేందుకు ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు మళ్లీ 1 బిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. కానీ, ఇది కూడా సాధ్యం కాక‌పోవ‌డంతో ఇప్పుడు వేత‌నాల చెల్లింపు దుర్భ‌రంగా మారింది. 


ఏపీలో కొన‌సాగుతున్న ఒప్పందం


ఏపీ ప్ర‌భుత్వం బైజూస్(Byjus) కంటెంట్‌పై చేసుకున్న ఒప్పందంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న కూడా చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. ఈ ఒప్పందం కొన‌సాగిస్తూ.. ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. 3 నుంచి 8వ‌త‌ర‌గ‌తి విద్యార్థుల వ‌ర‌కు బైజూస్ కంటెంట్‌ను అందిస్తున్న విష‌యం తెలిసిందే.