భీమ్లా నాయక్ సినిమా విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీలో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శితం  అవుతున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును చంద్రబాబు ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజా సమస్యలు పక్కన పెట్టి, థియేటర్లు, సినిమా విషయంపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. సినిమాలో ఏపీలో జగన్ ప్రభుత్వం వేధిస్తోందని, ఆయన తన మూర్ఖపు వైఖరిని వీడాలని సూచించారు. ఈ మేరకు చంద్రబాబు వరుసగా ట్వీట్లు చేశారు.


‘‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం సీఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకొని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంటు రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరిని వీడాలి.’’


‘‘రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి.. థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే... ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం పార్టీ తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది.. నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్లు చేశారు.