AP Cabinet Meet :  ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 20న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సెప్టెంబరు 21 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న నేపథ్యంలో, ఒకరోజు ముందు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరుగుతాయని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, మరో రెండు రోజులు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.


మరో వైపు 13, 14 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అమిత్ షా, మోదీ అపాయింట్‌మెంట్లు ఖరారు కాగానే ఢిల్లీ వెళ్లనున్నారు.  ఇంకా వారి వైపు నుంచి స్పందన రాలేదు.  ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు, యూసీసీ, మహిళా బిల్లులను ఆమోదం పొందేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్రం NDA పక్షాలతో పాటుగా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోరుకుంటోంది. 


పార్లమెంట్‌లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలోని 543 స్థానాల్లో 67 శాతం మద్దతు దక్కాలి. దీంతో పాటుగా రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్ధించాలి. దీంతో పాటుగా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాలి. లోక్‌సభలో బీజేపీకి 333 సీట్ల ఉన్నందున  61 శాతం మద్దతు ఉన్నట్టే. కానీ.. బిల్లు ఆమోదానికి మరో 5 శాతం ఓటింగ్ అవసరం. లోక్‌సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో చూసుకున్నా... 38 శాతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంది. అక్కడా వైసీపీ మద్దతు అవసరం. రాజ్యసభలో వైసీపీకి ఉన్న తొమ్మిది మంది సభ్యులు బిల్లుల ఆమోదానికి కీలకంగా మారారు. 


బీజేపీ పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ బిల్లులు ఆమోదం పొందాంటే 14 రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఆ సమయంలోనూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది.  పార్లమెంట్‌లో ఇప్పటివరకు ఎన్టీయే సర్కార్‌ తీసుకొచ్చిన బిల్లులకు వైఆర్‌ఎస్‌సీపీ మద్దతు ఇచ్చింది. వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు కూడా వైసీపీ అండగా నిలిచింది. అయితే.. ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ సర్కార్‌ ప్రవేశపెట్టబోతున్న కీలక బిల్లులకు మద్దతు ఇచ్చే అంశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అటు.. చంద్రబాబు అరెస్ట్‌... ఇటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఎన్డీయే సర్కార్‌ ప్రవేశపెట్టనున్న బిల్లుల మద్దతు...  ఈ క్రమంలో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.