మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు(అక్టోబరు 3) విచారణకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా పేర్కొని అరెస్టు కూడా చేశారు. అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ను గత నెల మూడో వారంలో దాఖలు చేశారు. ఇది నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందుకు రానుందని ‘లైవ్ లా’ ట్వీట్ చేసింది.






గత నెల మూడో వారం చివరిలో దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ వివిధ కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. తొలుత సెప్టెంబరు 26న ఈ పిటిషన్ విచారణ చేయాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో క్యురేటివ్ పిటిషన్‌లపై స్పెషల్ బెంచ్ సమావేశం అయినందున ఆ రోజు లిస్ట్ అయిన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. అందులో చంద్రబాబు పిటిషన్ కూడా ఉండడంతో సెప్టెంబరు 27 కి వాయిదా పడింది.


విచారణకు విముఖత చూపిన జడ్జి
సెప్టెంబరు 27న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి (బెంచ్) బదిలీ చేశారు. దీంతో పిటిషన్ విచారణ అక్టోబరు 3కి వాయిదా పడింది. ఆ రోజు తొలుత ఈ పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం ముందుకు రాగా, వారిలో ఓ న్యాయమూర్తి ఈ కేసు వినేందుకు సుముఖత చూపలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పడంతో మరో బెంచ్ కు బదిలీ చేయాల్సి వచ్చింది. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, రెండో న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఉన్నారు. జస్టిస్ భట్ ఈ పిటిషన్ విచారణకు నిరాకరించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... ‘‘మై బ్రదర్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి ఈ పిటిషన్ విచారణపై కొన్ని అంతరాలు ఉన్నాయి. మిస్టర్ హరీష్ సాల్వే మేం ఈ పిటిషన్‌ని మరో బెంచ్ కి బదిలీ (పాస్ ఓవర్) చేస్తాము’’ అని అన్నారు.


సీజేఐ ఎదుట మెన్షన్ చేసిన లాయర్లు
అయితే, చంద్రబాబు తరపు లాయర్లు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని సీజేఐ ఎదుట మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్‌ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్‌ కోరుకుంటున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్‌ కోరుకోవడం లేదని లూథ్రా తెలిపారు. త్వరగా లిస్ట్‌ చేయాలన్నది తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన అని లూథ్రా అన్నారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశం అని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టేందుకు అవకాశం లేని కేసు ఇదని చెప్పారు. ట్రయల్‌ కోర్టు జడ్జిని సంయమనం పాటించాలని చెప్పలేమని అన్నారు. జెడ్‌ కేటగిరీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్‌ చేస్తారా? అని అన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని సిద్ధార్థ్ లూథ్రా అన్నారు.