Sunil Yadav: వైఎస్ వివేకా హత్య కేసు నిందితునిగా ఉన్న సునీల్ యాదవ్ ప్రాణ భయంతో ఎస్పీని కలిశారు. వైఎస్ఆర్‌‌సీపీకి చెందిన వారు తనను బెదిరిస్తున్నారని రక్షణ కల్పించాలని కోరారు.  వివేకా హత్య కేసులో ఏ-2గా సునీల్ యాదవ్ ఉన్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడటాన్ని కొందరు భరించలేకపోతున్నారని..తీవ్రంగా బెదిరిస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.  హత్య అనే సినిమాలో తనను, తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని సునీల్ యాదవ్  వాపోయారు. ఆ చిత్రాన్ని వెంటనే నిలుపుదల చేయాలని  నలుగురే వివేకాను చంపినట్లు చూపించారని చెప్పారు.  కానీ ఎనిమిది మంది పాత్ర ఉందని దానిని ఎందుకు చూపించలేదని సునీల్ యాదవ్ మీడియా ఎదుట ప్రశ్నించారు.


వైసీపీకి చెందిన వారే ఈ సినిమా తీశారని సునీల్ యాదవ్ ఆరోపించారు. చందల్ గూడ జైలులో ఉన్నప్పుడే తనను బెదిరించారని.. బయటకు వచ్చిన తర్వాత మరింతగా బెదిరిస్తున్నారన్నారు.  తనను ఎవరెవరు బెదిరిస్తున్నారనే విషయాలన్నీ ఎస్పీకి వివరించానని .. రెండు రోజుల్లో తనకు రక్షణ కల్పించే చర్యలు  తీసుకుంటామని తెలిపారన్నారు.  ఇప్పటికే తన ఇంటి వద్ద పికెటింగ్ ఉందని సునీల్ తెలిపారు. 


ఇప్పటికే ఈ కేసులో   అప్రూవర్ గా మారిన  దస్తగిరి కడప ఎస్పీని కలిసి భద్రత కల్పించాలని కోరారు. ఆయనకు కడప ఎస్పీ 2=2 భద్రత కల్పించారు.   అప్రూవర్ గా మారిన దస్తగిరికి గతంలో సీబీఐ అధికారుల సూచనలో  టు ప్లస్ టు భద్రత కల్పించారు.  కానీ తర్వాత వన్ ప్లస్ వన్ కు తగ్గించారు.  సాక్షుల వరుస మరణాలు జరుగుతున్న తరుణంలో తనకు వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  తనను కడప జైల్లో డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించారని చెప్పాు.  వివేకాను తమచేత హత్య చేయించిన జగన్ మోహన్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతుంటే తామెందుకు భయపడాలని దస్తగిరి ప్రశ్నించారు.  నిజాలు నిగ్గు తేల్చడానికి జగన్​తో ఎక్కడికైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. పులివెందులలో జగన్ ఇంటి వద్దే నివాసం ఉంటున్నానని..  2021లో తాను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే కేసులో నిందితులు, కుట్రధారులు ఎవరనే విషయాలు బయటికి తెలిశాయన్నారు.   తాను చెప్పింది తప్పని జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్లలేదని దస్తగిరి ప్రశ్నించారు. హత్య చేయించింది వాళ్లే కాబట్టే అపుడు ఏం మాట్లాడ లేదన్నారు. 


సాక్షులు వరుసగా చనిపోతున్న అంశంపై విచారణ జరపడానికి ఏపీ  ప్రభుత్వం సిట్ వేసింది.   2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షులు ఆరుగురు మరణించడం వెనకున్న కారణాలను నిగ్గు తేల్చడానికి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్​లో జమ్మలమడుగు, పులివెందుల డీఎస్పీలతో పాటు ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరు రంగన్న మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.