Speaker Tammineni Seetharam : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన కామెంట్స్ చేశారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పని అయిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బాదుడే బాదుడుతో టీడీపీ(TDP) సంగతి ముగుస్తుందన్నారు.  చంద్రబాబు యాత్రలు అసమర్థుడి అంతిమయాత్ర అని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల(Electricity Charges) గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే హాస్యాస్పదం అన్నారు. బషీర్ బాగ్ లో పోలీస్ కాల్పులతో(Police Firing)  రైతులు మరణానికి కారకుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబును బషీర్ బాగ్ రక్తం మరకలు నేటికి వెంటాడుతున్నాయన్నారు. 


ఆ రక్తపు మరకలు  


ఆరోజు విద్యుత్ ఛార్జీల పెంపుతోనే బషీర్ బాగ్ లో రైతులు ఉద్యమం చేసిందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే  బట్టలు ఆరబెట్టడానికా అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబు ఇవాళ విద్యుత్ ఛార్జీల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని స్పీకర్ జోస్యం చెప్పారు.  మూడు సార్లు ప్రజలు అధికారం ఇస్తే పరిపాలించుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. అసమర్ధుడుని అందలం ఎక్కిస్తే ఏంజరుగుద్దో చంద్రబాబు హయాంలో ప్రజలకు తెలిసిందన్నారు. ఇచ్చినమాట తప్పకుండా క్యాలెండర్ ప్రకటించి క్లియర్ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)ది అన్నారు. మ్యానిఫెస్టోని సైతం టీడీపీ సైట్ లోంచి తీసివేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. 


అసమర్థుడి అంతిమయాత్ర


"ఈ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం. గతంలో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా యాత్ర చేస్తే బస్సులో పెట్టి బాదినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఫినీష్. చంద్రబాబు అసమర్థుడు. సీఎం జగన్ కేవలం మూడేళ్లలో చెప్పింది చేసి చూపించారు. మేనిఫెస్టోలో ప్రకటించినవి అన్ని క్లియర్ చేస్తున్న వ్యక్తి జగన్. ఇవాళ ఎవరు సమర్థుడో ప్రజలకు తెలుసు. చంద్రబాబుది అసమర్థుడి అంతిమాత్ర" అని స్పీకర్ అన్నారు.  


"సృష్టికే దివ్య సందేశం అందించి, భగవద్గీత బోదించిన శ్రీకృష్ణుడు బీసీ, కురు సామ్రాజ్య పితామహుడు ఓ ఫిషర్ మాన్.. బీసీ,  రామాయాణాన్ని అందించిన వాల్మీకి సైతం బీసీ, భారతదేశం సమస్థం బీసీలమయం.  ఇవన్నీ చారిత్రాత్మక వాస్తవాలు. ఇవి కాదంటే  చరిత్ర క్షమించదు. భగీరథుడు  ఓ పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన మహార్షి. గంగను భూమికి దించిన భగీరథుడు సైతం బీసీ. ఆయనను గుర్తుచేసుకోవడం కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యం మహోన్నతం" అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.