Palnadu politics :  పల్నాడులో వైసీపీ నేతల మధ్య రాజకీయ చిచ్చు రేగింది.  నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయనున్న అనిల్ కుమార్ యాదవ్ .. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిపై విమర్శలు చేశారు. దీనిపై జంగా కృష్ణమూర్తి స్పంిదంచారు.  మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని  జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు.  సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం తనది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం తనకు లేదని తెలిపారు. అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. 


2014లో తనను ఎవరు ఓడించారో కూడా తెలుసని పేర్కొన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఉంది.. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పదవి ఉందని చెప్పారు. ఐనా తాను నిజాలే మాట్లాడుతానని.. జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు చెప్పే తత్వం తనదని అన్నారు. బీసీలకు పదవి ఇవ్వలేదని తాను అనలేదు.. ఆ పదవులకు పవర్ లేదని చెప్తున్నానని పేర్కొన్నారు. బీసీ ప్రతినిధులకు వైసీపీలో గౌరవం లేదని ఆయన ఆరోపించారు. 1985 నుండి తాను రాజకీయాల్లో ఉన్నానని.. అనిల్ కుమార్ 2009లో రాజకీయాలు ప్రారంభించావని.. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.                                         


అంతకుముందు.. అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని, అలాంటి నాయకుల్లో జంగా కూడా ఉన్నారని ఆరోపించారు. ఫేక్ నాయకులే పార్టీలను మారతారంటూ మండిపడ్డారు. జగన్‌ను అభిమానించేవారు ఎప్పటికీ పార్టీ మారబోరని, కనీసం ఆ ఆలోచన కూడా చేయరని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. జంగా కృష్ణమూర్తికి 2014లో టికెట్ ఇచ్చారని, ఆ ఎన్నికల్లో ఓడిపోతే అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చారని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని జంగా కృష్ణమూర్తికి కూడా జగన్ చెప్పారని, ఆయన వద్దనుకుంటేనే తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు.                              


వైసీపీలో బీసీలకు ప్రాధాన్యత లేదనడం సరికాదన్నారు. సీఎం జగన్ ద్వారా బాగా సంపాదించుకొని మళ్లీ ఆయనను విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని ఫైర్‌ అయ్యారు. నాలుగున్నరేళ్లు జగన్ దేవుడిలా కనిపించారు.. జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారు.. పార్టీని వీడేటప్పుడు మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వైసీపీ 2014లో జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చింది.. అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.. సీఎం జగన్ ఏమి చేయలేదో చెప్పాలి? అని జంగా కృష్ణమూర్తిని నిలదీశారు.