Byreddy Siddharth Reddy : ప్రతిపక్షాల పొత్తులపై వైసీపీ నేత, శాప్ ఛైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఆయన... మాట్లాడుతూ జగనన్న కోసం పనిచేయడానికి ఒక ప్రైవేటు సైన్యమే సిద్ధంగా ఉందన్నారు. జగన్ కనుసైగ చేస్తే చాలు విపక్షాలను ఎదుర్కోవడానికి తామే సరిపోతామన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు తీసుకొస్తున్న జగన్నకు రక్షణ కవచంగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి. మార్పు కోసం, మంచి చేయడానికి ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక విపక్షాలు పొత్తులకు దిగుతున్నాయని బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. వంద పార్టీలు కలిసినా, వెయ్యిమంది కలిసినా, వంద మీడియా సంస్థలు కలిసి తప్పుడు ప్రచారం చేసినా, వేల కోట్లు ఖర్చు చేసినా జగన్ రెడ్డిని ఏం చేయలేరన్నారు. ఈ రోజు ఒక నాయకుడు చంద్రబాబును కలిశారని, తాను ఎటువంటి అవినీతి చేయలేదని సదరు నేత చెప్పుకుంటున్నారని, అయితే దొంగతనం చేసేవాడికి మద్దతిచ్చేవాడిని ఏమంటారని ప్రశ్నించారు. రాజు ఎవరో రాక్షసుడెవరో ఆలోచించుకుని ప్రజలంతా నాయకుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.


రాజకీయాల్లో యువకులను ప్రోత్సహిస్తున్నారు


చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, వైసీపీ యువజన విభాగం అధ్యక్షునిగా, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అయిన జక్కంపూడి రాజా తమకు రోల్ మోడల్ అని సిద్ధార్థ రెడ్డి ప్రశంసించారు. తనలాంటి ఎంతో మంది యువకులను రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. బీసీలను, పేదలను, ఎస్సీలను, ఎస్టీలను కూడా నాయకులుగా మార్చారన్నారు. జక్కంపూడి గణేష్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ను గుర్తించే గోదావరి జిల్లాలకు వైసీపీ యువజన విభాగానికి కో-ఆర్డినేటర్ గా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారని సిద్ధార్థరెడ్డి తెలిపారు. 


బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి పొత్తులు


 పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు భేటీపై శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ ఎప్పుడూ వేరు కాదని ఒక్కటే అన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా గెలిచేది సీఎం జగన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ గెలవడం ఖాయమని బైర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరెవరికి ఎన్ని పథకాలు, ఎన్ని నిధులు ఇచ్చామో గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుందన్నారు. ఇతర పార్టీలు ఈ లెక్కలపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా ఏం చేయలేరన్నారు. పార్టీ యువతంతా సీఎం జగన్‌కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తారని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.  సీఎం జగన్ ను ప్రజలు  గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. జక్కంపూడి కుటుంబం అంటే తమ సొంత కుటుంబం అనే భావన రాజానగరం ప్రజల్లో ఉందని తెలిపారు.  సీఎం జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ ప్రతిపక్షాలకు లేదన్నారు. సీఎం జగన్ కనుసైగ చేస్తే చాలు, ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి సీఎం జగన్ మంచి చేస్తున్నారన్నారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంత మంది పొత్తుల కోసం తిరుగుతున్నారని బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.