Yanamala Rama Krishnudu:
రాజమహేంద్రవరం : దోపిడీ వ్యవస్థకు ఏపీ సీఎం జగన్ అధిపతి అని, యువతను దెబ్బతీయడమే ఆయన క్రిమినల్ ఆలోచన అని రాష్ట్ర మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. స్కిల్ డెవలెప్మెంట్ లో అవినీతి జరగలేదని సీమన్స్, డిజైన్ టెక్ సంస్థలే చెప్తున్నాయని యనమల స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో నారా లోకేష్ బస చేసే కేంద్రం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో చంద్రబాబును అరెస్టు చేశారని, అక్రమ కేసులు పెట్టారన్న భావన ప్రజల్లో ఉందన్నారు.  రాష్ట్రంలో 40కి పైగా స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు పెట్టామని సీమన్స్ సంస్థవాళ్లే చెప్పారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా 26 సార్లు చంద్రబాబుపై విచారణ చేయించినా.. ఏమీ కాలేదన్నారు.


ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైల్లో పెట్టినందుకు ప్రజలు స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక మంచి సంస్థ సీమన్స్ అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ట్రైనింగ్ కోసం ఈ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు. స్కిల్ డెవలెప్మెమెంట్ కు యువత వేలు ఖర్చు చేయాల్సి వస్తుంన్న కారణంగా తక్కువ ఖర్చుతో సీమన్స్ సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగాలొస్తాయన్న ఉద్దేశంతో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. క్రిమినల్ మైండ్ ఉన్న జగన్.. చంద్రబాబుకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు.? జైలు లోపలికి నన్ను పంపిస్తే భద్రతలో లోపాలు చూపిస్తా అన్నారు. ఎటువంటి అక్రమ కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొంటామని యనమల ధీమా వ్యక్తం చేశారు.


జగన్ ఒక గజదొంగ..!
తండ్రి వైఎస్సార్ అధికారంతో వేలకోట్లు దోచుకున్న జగన్ ఒక గజదొంగ అని గతంలోనే నిరూపించాం అన్నారు. జగన్ దోచుకున్న రూ.43 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అటాచ్ చేసిందని.. ఈడీ ఛార్జ్ షీట్, సీబీఐ ఛార్జ్ షీట్లు 26 ఉండగా..16 నెలలు జగన్ జైల్లో ఉన్నాడని గుర్తుచేశారు. సీఎంగా జగన్ రూ.2.5 లక్షల కోట్లు ప్రజాధనం స్వాహా చేశారని.. ఇసుక, మైన్స్, లిక్కర్ ద్వారా దోచుకుంటున్నారని ఆరోపించారు.  


యనమల  మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదాయం వచ్చేవన్నీ వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. వాళ్లు చెప్పినట్లు ఆదాయం వస్తే అప్పులు ఎందుకు చేస్తున్నారు.? ఈ ప్రభుత్వమే దోపిడీ చేస్తే రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ప్రజలు అడుగుతున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ కాంట్రవర్సితో ఎవరు నష్టపోయారు.? యువతకు నష్టం జరుగుతోంది. అసలే రాష్ట్రంలో 34 శాతం నిరుద్యోగం ఉంది. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే స్కిల్ డెవలెప్మెంట్ ద్వారా ఎక్కువ లబ్ది చేకూరుతుంది. యువతకు ఉద్యోగాలు రావాలంటే దానికి తగ్గ స్కిల్స్ ఉండాలి. అమెరికాలోనే స్కిల్స్ లేక 7 లక్షల మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. స్కిల్స్ నేర్చుకుంటే వృత్తిలో మరింత రాణిచగలుగుతారు. అందుకే గతంలో గుజరాత్ లో పర్యటించి స్కిల్ డెవలెప్మెంట్ ను ఏపీలో ప్రవేశపెట్టాం. 


కంబోడియాను ఆదర్శంగా తీసుకున్నారా?
కంబోడియాలో ఎన్నికలు జరిగాయి. అక్కడ హాన్ సేన్ ఎన్నికల కమిషన్ సాయంతో ప్రతిపక్షాలు లేకుండా గెలిచారు. జగన్ కంబోడియాను ఆదర్శంగా తీసుకున్నారేమో అనిపిస్తోంది. డబ్బుతో ఎన్నికలు చేయవచ్చని రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడు. రాజకీయాల్లో ఇంత చెడు క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. మలేషియన్ ప్రెసిడెంట్ ను గతంలో కరెప్టెడ్ లీడర్ అనుకునేవాళ్లు. ఇప్పుడు జగన్ ను అనుకుంటున్నారని’ యనమల అన్నారు.


ఏపీ పరిస్థితి చూసి ఇక్కడ ఎవరైనా పరిశ్రమలు పెడతారా.? అందుకే సీఐడీతో తప్పుడు కేసులు పెడుతున్నారు. అభివృద్ధి చెందిన 5 రాష్ట్రాల్లో రాష్ట్రం ఉండేది.. కానీ ఇప్పడు లేదు.  వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయిందన్నారు. మంత్రి బొత్స కూడా కబుర్లు చెప్తున్నారు. రూ.11కోట్లకు కక్కుర్తి పడటంతోనే ఆ కంపెనీ పుణెకు వెళ్లిపోయింది. కుటుంబానికే ద్రోహం చేసిన జగన్ కు రాష్ట్రానికి ద్రోహం చేయడం ఎంతసేపు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది. చంద్రబాబును బద్నాం చేసేందుకు జగన్ ఏం చెప్తే సీఐడీ అది చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అందర్నీ జగన్ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు.